ప్లే ఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ దుమ్మురేపింది. ఓపెనర్ల వీరబాదుడుకు పేసర్ల విజృంభణ తోడవడంతో రాజస్థాన్ను చిత్తు చేసిన కోల్కతా 14 పాయింట్లతో నాలుగో బెర్త్కు అడుగు దూరంలో నిలిచింది. నేడు సన్రైజర్స్తో జరుగనున్న ఆఖరి పోరులో ముంబై ఇండియన్స్ ‘భారీ’ తేడాతో నెగ్గకపోతే మోర్గాన్ సేన సజావుగా ప్లే ఆఫ్స్ చేరుతుంది!
షార్జా: తప్పక నెగ్గాల్సిన పోరులో కోల్కతా నైట్రైడర్స్ చెలరేగిపోయింది. మొదట బ్యాటింగ్లో దంచికొట్టిన మోర్గాన్ సేన.. ఆనక బౌలింగ్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా గురువారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోల్కతా 86 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. ఈ విజయంతో 14 పాయింట్లకు చేరడంతో పాటు రన్రేట్ను భారీగా మెరుగుపర్చుకున్న మోర్గాన్ గ్యాంగ్.. ప్లే ఆఫ్స్లో మిగిలి ఉన్న నాలుగో బెర్త్ను కైవసం చేసుకోవడానికి కీలక ముందడుగు వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వెంకటేశ్ అయ్యర్ (38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ శివం మావి (4/21), ఫెర్గూసన్ (3/18) ధాటికి రాజస్థాన్ 16.1 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ తెవాటియా (44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్.
కోల్కతా: 20 ఓవర్లలో 171/4 (గిల్ 56, వెంకటేశ్ 38; సకారియా 1/23),
రాజస్థాన్: 16.1 ఓవర్లలో 85 ఆలౌట్ (తెవాటియా 44; మావి 4/21, ఫెర్గూసన్ 3/18).