Michael Bracewell : మొదటి టీ20లో పిచ్ అనూహ్యంగా స్పిన్నర్లకు అనుకూలించడంతో తాము ఆశ్చర్యపోయామని న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రాస్వెల్ అన్నాడు. ‘రాంచీ పిచ్ టర్న్ అయింది. మా స్కోర్ను కాపాడుకోవడంలో సాయపడింది’ అని బ్రాస్వెల్ తెలిపాడు. ఈ మ్యాచ్లో బ్రాస్వెల్ రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ వికెట్ పడగొట్టి భారత్కు షాకిచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను వెనక్కి పంపాడు. ఆ తర్వాత శాంటర్న్ ఓపెనర్ శుభ్మన్ గిల్, దీపక్ హుడాను ఔట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ను సోధీ పెవిలియన్ పంపాడు. ఈ మ్యాచ్లో కివీస్ స్పిన్నర్లు ఐదు వికెట్లు పడగొట్టి భారత్ను దెబ్బ తీశారు. దాంతో ఆ జట్టు 21 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. మూడు టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టీ20 రేపు లక్నోలో జరగనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లకు 176 రన్స్ చేసింది.వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీసి కివీస్ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఒకదశలో 43 రన్స్కే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్ను కాన్వే (52), మిచెల్ (59) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. 177 టార్గెట్ ఛేదనలో భారత్ను బ్రాస్వెల్, శాంటర్న్ దెబ్బతీశారు. దాంతో, 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్(47), పాండ్యా (21) మాత్రమే రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (50) ధాటిగా ఆడినా జట్టుని గెలిపించలేకపోయాడు.