హైదరాబాద్, ఆట ప్రతినిధి: మధ్యప్రదేశ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్గేమ్స్లో తెలంగాణ అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం జరిగిన కయాకింగ్, కనోయింగ్ విభాగంలో రజతం సహా రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకుంది. ఎంపీ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ లేక్లో జరిగిన పురుషుల సీ-2 1000మీటర్ల విభాగంలో రాష్ర్టానికి చెందిన ప్రదీప్కుమార్, అభయ్ రజత పతకంతో మెరిశారు. రేసును 4ని.24.59 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచారు. మధ్యప్రదేశ్, ఒడిశాకు వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు లభించాయి. పురుషుల కే-2 1000మీటర్ల ఈవెంట్లో కునాల్, మహేంద్రసింగ్ జోడీ కాంస్య పతకం కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల సీ1 1000మీటర్ల కేటగిరీలో అమిత్కుమార్సింగ్ కాంస్యం దక్కించుకున్నాడు. పోటీల రెండో రోజు మూడు పతకాలు ఖాతాలో వేసుకున్న తెలంగాణ ప్రస్తుతం పతకాల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతున్నది.