గన్నేరువరం, డిసెంబర్ 19: జాతీయ స్థాయి అండర్-14 వాలీబాల్ టోర్నీకి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్కు చెందిన హన్మాండ్ల అక్షిత్ ఎంపికయ్యాడు. భువనేశ్వర్(ఒడిశా) వేదికగా ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు జరిగే జాతీయ టోర్నీలో అక్షిత్ బరిలోకి దిగనున్నాడు. ఇటీవల నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అక్షిత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో సత్తాచాటడం ద్వారా ఎంపికైనట్లు జిల్లా వాలీబాల్ కోచ్ రాజ్కుమార్ పేర్కొన్నారు.
అక్షత్..తన తండ్రి భాస్కర్ బాటలో పయనిస్తున్నాడు. భాస్కర్..ప్రభుత్వ ఉపాధ్యాయుడే కాకుండా రాష్ట్ర స్థాయి వాలీబాల్ ప్లేయర్ కావడం విశేషం. చిన్ననాటి నుంచి తండ్రి చూస్తూ పెరిగిన అక్షత్..వాలీబాల్పై మక్కువ పెంచుకున్నాడు. పీఈటీ రాజ్కుమార్ దగ్గర శిక్షణ తీసుకున్న అక్షిత్ పలు వాలీబాల్ టోర్నీల్లో పోటీపడ్డాడు. జాతీయ స్థాయిలో ఆడాలనుకున్న తన కలను కొడుకు అక్షిత్ ద్వారా నెరవేర్చుకోవాలనుకున్న భాస్కర్.. తర్ఫీదు విషయంలో జాగ్రత్త తీసుకునేవాడు.
రాష్ట్రంలో ఎక్కడ టోర్నీ జరిగినా..అక్షిత్ను పంపేవాడు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న అక్షిత్ జాతీయస్థాయికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు భాస్కర్, లావణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్షిత్ ఎంపికపై వర్దేల్లి వెంకటేశ్వర్లు, పీఈటీలు శ్రీను, రాజ్కుమార్, లక్ష్మణ్, శ్రీపాల్రెడ్డి, భాస్కర్, నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.