ముంబై: కెప్టెన్సీ వివాదం విషయంలో విరాట్ కోహ్లీ, బీసీసీఐకి మధ్య ఏర్పడిన విభేదాలను వెంటనే పరిష్కరించుకోవాలని భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ సూచించాడు. టీ20 కెప్టెన్సీతో పాటు వన్డే నాయకత్వం నుంచి తప్పించడంపై కోహ్లీ.. బీసీసీఐని లక్ష్యంగా చేసుకుని మాట్లాడాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తనను తప్పుకోవద్దని ఎవరూ సూచించలేదని ఒక రకంగా బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఇరకాటంలో పెడుతూ కోహ్లీ మీడియా భేటీలో వ్యాఖ్యానించాడు. దీనికి తోడు ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ నాయకత్వం నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఒక దశలో విరాట్ వైఖరిపై ఆగ్రహంతో గంగూలీ షోకాజ్ నోటీసులు పంపేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విరాట్, బీసీసీఐకి మధ్య ఏర్పడిన అగాధంపై కపిల్దేవ్ తాజాగా స్పందించాడు. మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘కెప్టెన్సీ మార్పుపై ఏర్పడిన అసఖ్యతపై కోహ్లీ, బీసీసీఐ ఒకసారి మాట్లాడుకుంటే మంచిది. ఏమైనా బేధాభిప్రాయాలు ఉంటే సమసిపోతాయి.
ఫోన్ తీసుకుని అసలు సమస్య ఏంటి అన్నదానిపై చర్చించుకుంటే అయిపోతుంది. వ్యక్తిగత విషయాలకంటే జట్టు, దేశం ముఖ్యమని భావించండి. కెరీర్ తొలి నాళ్లలో కెప్టెన్గా ఉన్నప్పుడు నేను ఇలాగే భావించాను. అన్నీ నాకే కావాలన్న ఆలోచనతో ఉండేవాణ్ని. కానీ కొన్నిసార్లు అవి మనకు దక్కకపోవచ్చు. అలాగనీ కెప్టెన్సీ వదులుకోమని కాదు. ఒకవేళ విరాట్ గనుక ఈ కారణంగానే వైదొలిగితే ఎవరూ ఏం చేయలేరు. అతడు మరిన్ని మ్యాచ్ల్లో ముఖ్యంగా టెస్టు క్రికెట్లో పరుగులు సాధించాలని కోరుకుంటున్నా. కోహ్లీ గొప్ప ఆటగాడు, అతడు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిద్దాం. అదే సమయంలో ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది’ అని అన్నాడు.