హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. హెచ్సీఏ ఉపాధ్యక్షుడు జాన్మనోజ్ సహా నలుగురు కార్యవర్గ సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ హెచ్సీఏ అంబుడ్స్మన్ జస్టిస్ దీపక్వర్మ జారీ చేసిన ఉత్తర్వులను సింగిల్ జడ్జి నిలిపివేస్తూ తీర్పు ఇవ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అంబుడ్స్మన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేసిన కేసులో ప్రతివాదులుగా ఉన్న హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఇతరుల అభ్యంతరాలను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని తప్పుబడుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సింగిల్ జడ్జి జస్టిస్ అమర్నాథ్గౌడ్ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అజారుద్దీన్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను ధర్మాసనం విచారించి తీర్పు వెలువరించింది. అంబుడ్స్మన్ ఉత్తర్వులపై జాన్మనోజ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఉత్తర్వులు జారీ చేయాలని రిట్పిటిషన్ను సింగిల్ జడ్జి వద్దకు మళ్లీ పంపుతూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.