ఉప్పల్, ఆగస్టు 6: రాష్ర్టాన్ని దేశానికి దిక్సూచిగా మలిచి, క్రీడా విప్లవానికి సీఎం కేసీఆర్ బాటలు వేశారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఆదివారం స్పోర్ట్స్ హాస్టలర్స్ రీ యూనియన్ మీట్ ఘనంగా జరిగింది. ముంబాయి, కలకత్తా, చెన్నై, బెంగుళూరు, తదితర నగరాల్లోని బ్యాంకింగ్, రైల్వే, తదితర రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో, ఉన్నతస్థాయిలో స్థిరపడిన అధికారులు, పలువురు మాజీ క్రీడాకారులు రీ యూనియన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు వేణుగోపాలచారి, గజ్జెల నగేష్, డీపీఎస్ చైర్మన్ మల్క కొమురయ్య, ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్, క్రీడా సంఘాల ప్రతినిధులు వెంకటేశ్వర్రెడ్డి, రవికుమార్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.