భివాని: భారత బౌలర్ జోగిందర్ శర్మ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకంటించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లతోపాటు దేశవాలీ క్రికెట్కు కూడా జోగిందర్ గుడ్బై చెప్పాడు. ఈ మేరకు ‘బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)’ కార్యదర్శికి శుక్రవారం తన రిటైర్మెంట్ లేఖను పంపించాడు. ఇన్నాళ్లు తనకు సహకరించిన బీసీసీఐకి, హర్యానా క్రికెట్ అసోసియేషన్కు, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి, హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి జోగిందర్ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు.
అదేవిధంగా తను టీమ్లో ఉన్నప్పుడు అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చిన కోచ్లకు, తనతోపాటు ఆడిన ఆటగాళ్లకు, జట్టుతో కలిసి ప్రయాణించిన సపోర్టింగ్ స్టాఫ్కు కూడా జోగిందర్ తన రిటైర్మెంట్ లేఖలో కృతజ్ఞతలు తెలిపాడు. తనమీద ప్రేమతో చిన్నచిన్న త్యాగాలు చేసిన కుటుంబసభ్యులకు, స్నేహితులకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పాడు.
కాగా, అంతర్జాతీయ క్రికెట్లో కుడిచేతి వాటం పేస్ బౌలర్ అయిన జోగిందర్ నాలుగు టీ20లు, నాలుగు వన్డే మ్యాచ్లు ఆడాడు. అయితే, 2007 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో విజయం కోసం పాకిస్థాన్కు ఆఖరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా కెప్టెన్ ధోని.. జోగిందర్ చేతికి బాల్ ఇచ్చాడు. అయితే జోగిందర్ తొలి రెండు బంతుల్లోనే ఏడు పరుగులు సమర్పించుకున్నాడు.
దాంతో పాకిస్థాన్ గెలుపు సమీకరణం నాలుగు బంతుల్లో 6 పరుగులుగా మారింది. దాంతో పాకిస్థాన్ గెలుపు ఖాయం అనుకున్నారంతా. కానీ జోగిందర్ అద్భుతం చేశాడు. తర్వాత నాలుగు బంతుల్లో ఒక్క బౌండరీకి కూడా అవకాశం ఇవ్వకుండా భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ ఒక్క ఓవర్తో భారత క్రికెట్ అభిమానుల్లో జోగిందర్ పేరు మార్మోగింది.
ఇక, ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్ తరఫున జోగిందర్ శర్మ 16 మ్యాచ్లు ఆడి 12 వికెట్లు తీశాడు. టెయిలెండర్గా బ్యాట్తోనూ 36 పరుగులు రాబట్టాడు. 2007 వరల్డ్కప్ సెమీఫైనల్లో కూడా ఆస్ట్రేలియాకు ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జోగిందర్ శర్మ హర్యానా పోలీస్ డిపార్టుమెంట్లో డీఎస్పీగా పనిచేస్తున్నాడు.