Ashes Series : ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్(Ashes Series) తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దాంతో, 176 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ను జో రూట్(50 నాటౌట్) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. అడ్డుగోడలా నిలిచిన అతను కామెరూన్ బౌలింగ్లో ఫోర్ కొట్టి, ఆ తర్వాత బంతికి సింగిల్ తీసి ఫిఫ్టీకి చేరువయ్యాడు. ఆరో వికెట్కు జానీ బెయిర్స్టో(12)తో కలిసి 26 రన్స్ జోడించాడు. వీళ్లిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోర్ రెండొందలు దాటించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్… 202/5.
ఐర్లాండ్తో ఐకైక టెస్టులో సెంచరీ బాదిన ఓపెనర్ బెన్ డకెట్(12), జాక్ క్రాలే(61) ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించారు. కానీ, హేజిల్వుడ్ ఓవర్లో కీపర్ అలెక్స్ క్యారీ చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఓలీ పోప్(31)తో కలిసి క్రాలే స్కోర్ వేగం పెంచాడు. హాఫ్ సెంచరీ కొట్టిన క్రాలేని బోలాండ్ పెవిలియన్ పంపాడు. అక్కడి నుంచి ఆతిథ్య జట్టు వికెట్ల పతనం మొదలైది. ఐపీఎల్లో విఫలమైన హ్యారీ బ్రూక్(32)ను లియాన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్(1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. దాంతో, 176 పరుగులకే కీలకమైన 5 వికెట్లు పడ్డాయి.