Jasprit Bumrah : భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) వెన్ను నొప్పి కారణంగా కొన్నాళ్లుగా క్రికెట్కు దూరమైన విషయం తెలిసిందే. ఈమధ్యే న్యూజిలాండ్లో సర్జరీ చేయించుకున్నఈ యార్కర్ కింగ్ త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. మళ్లీ తన పదునైన బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టనున్నాడు. అవును.. తాజాగా బుమ్రా తన బౌలింగ్ షూ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. తాను మరికొన్ని రోజుల్లో బౌలింగ్ ప్రాక్టీస్కు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు ఇచ్చాడు.
బుమ్రా తన షూ ఫొటోకు ‘హలో నేస్తమా.. మనం మళ్లీ కలుస్తాం’ అని క్యాప్షన్ జోడించాడు. దాంతో, ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. బుమ్రా వచ్చేస్తున్నాడు, బుమ్రా ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. టీమిండియా బౌలింగ్ దళానికి వెన్నుముక అయిన బుమ్రా గత ఏడాది సెప్టెంబర్ నుంచి క్రికెట్ ఆడలేదు.
వెన్నునొప్పి కారణంగా టీ20 వరల్డ్ కప్, బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy)తో పాటు పదహారో సీజన్ ఐపీఎల్ నుంచి కూడా బుమ్రా తప్పుకున్నాడు. అయితే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC Final 2023) ఫైనల్ లోపైనా ఈ స్టార్ పేసర్ కోలుకుంటాడని అంతా ఆశించారు. కానీ, గాయం తీవ్రత దృష్ట్యా అతడిని బీసీసీఐ డబ్ల్యూటీసీకి ఎంపిక చేయలేదు. సర్జీరీ కోసం అతడిని న్యూజిలాండ్ పంపించింది. అక్కడ సర్జరీ విజయవంతం కావడంతో బుమ్రా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
ఈ ఏడాది వరల్డ్ కప్(ODI WC 2023)లో బుమ్రా కీలకం కానున్నాడు. ఆలోపు అతను ఫిట్నెస్ సాధించాలని బీసీసీఐతో పాటు యావత్ భారతదేశం కోరుకుంటోంది. స్వదేశంలో అక్టోబర్ – నవంబర్ మధ్య వరల్డ్ కప్ టోర్నీ ఉంటుంది. దాంతో, సొంత గడ్డపై రెండోసారి ట్రోఫీ అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా టీమిండియా గెలవలేదు. అందుకని వన్డే వరల్డ్ కప్ పోటీలను రోహిత్ సేన ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది.