ముంబై : టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా సెంట్రల్ కాంట్రాక్టుపై బీసీసీఐ పునరాలోచనలో పడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. కొద్దిరోజుల క్రితమే బోర్డు ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో బుమ్రాను ‘ఏ+’ క్యాటగిరీ నుంచి ‘ఏ’కు మార్చిన విషయం తెలిసిందే. గత సీజన్ వరకూ ‘ఏ+’ గ్రేడ్ అనుభవించిన బుమ్రా.. యేటా రూ. 7 కోట్ల వార్షిక వేతనం పొందేవాడు. కానీ ‘ఏ’కు మార్చడంతో అది కాస్తా రూ. 5 కోట్లు మాత్రమే పొందుతాడు. రోహిత్, కోహ్లీ టెస్టు, టీ20ల నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ.. ‘ఏ+’ గ్రేడ్ను తొలగించి ‘ఏ’ను మాత్రమే ఉంచింది. వీటిలో బుమ్రా, జడేజాతో పాటు కొత్త కెప్టెన్ గిల్ చేరాడు. అయితే కాంట్రాక్టులు ప్రకటించినప్పుడు బీసీసీఐ.. ఏ గ్రేడ్కు ఎంత? అన్నదానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు.
అయితే మూడు ఫార్మాట్లలో ఆడుతూ భారత జట్టు కీలక ఆటగాళ్లలో ఒకడైన బుమ్రాకు రూ. 2 కోట్లు తగ్గించడం సరైంది కాదన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ.. అతడికి పరిహారాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘బుమ్రాకు పరిహారాన్ని ఎలా సర్దుబాటు చేయాలనేదానిపై చర్చిస్తున్నాం. జట్టులో కొంతమంది ఏడాది పొడవునా మెరుగైన ప్రదర్శనలు చేసినప్పటికీ వారి గ్రేడ్ తగ్గింది. కాంట్రాక్టుల్లో సవరణలు జరిగే అవకాశం లేకపోలేదు’ అని తెలిపాడు.