మొహాలి: మొహాలీలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజున రికార్డుల మోత మోగుతున్నది. ఉదయం మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. కపిల్ దేవ్ 434 టెస్టు వికెట్ల రికార్డును సమం చేయగా.. తాజాగా రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో 150కి పైగా పరుగులు, ఐదు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 574 పరుగుల భారీ స్కోర్ వద్ద ఇన్సింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ 574 పరుగుల్లో రవీంద్ర జడేజా 175 పరుగులు చేశాడు. ఆ తర్వాత బౌలింగ్లోనూ జడేజా సత్తా చాటాడు. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. అంటే ఒకే టెస్టులో 150కిపైగా పరుగులు చేసి, ఐదు వికెట్లు తీశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు వినూ మన్కడ్, డెనిస్ అట్కిన్సన్, పాలీ ఉమ్రిగర్, గ్యారీ సోబర్స్, ముస్తాక్ మహ్మద్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు రవీంద్ర జడేజా ఆరో వాడిగా వారి సరసన చేరాడు.