IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-17 సీజన్లో భాగంగా బీసీసీఐ 21 మ్యాచ్లకు గాను షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు 17 రోజుల పాటు జరిగే షెడ్యూల్లో తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. దీంతో ఇప్పటికే ఇరు జట్ల అభిమానులు ఈ మ్యాచ్ను ‘ధోని వర్సెస్ కోహ్లీ’ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఐపీఎల్లో గతంలో మాదిరిగా విన్నర్ వర్సెస్ రన్నరప్ మధ్య నిర్వహించే తొలి మ్యాచ్ ఆనవాయితీకి బీసీసీఐ మంగళం పాడింది.
ఐపీఎల్లో 2022 దాకా గత సీజన్ ఫైనలిస్టుల మధ్య కొత్త సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ జరిగేది. 2021లో ఫైనలిస్టులు చెన్నై – కోల్కతా మధ్యే 2022 సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ జరిగింది. 2022లో గుజరాత్ టైటాన్స్ – రాజస్తాన్ రాయల్స్లు ఫైనల్ చేరాయి. కానీ గతేడాది సీజన్ ఆరంభ మ్యాచ్ చెన్నై – గుజరాత్ మధ్య జరిగింది. మరో నెల రోజుల్లో మొదలుకాబోయే 17వ సీజన్లో కూడా తొలి మ్యాచ్లో చెన్నై.. ఆర్సీబీతో తలపడనుంది. దీంతో విన్నర్ – రన్నరప్ల మధ్య తొలి మ్యాచ్ సంప్రదాయానికి తెరపడినట్టేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ధోని వర్సెస్ కోహ్లీ..
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, చెన్నై జట్టుకు 5 టైటిల్స్ అందించిన దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి చివరి సీజన్గా భావిస్తున్న ఐపీఎల్-17లో అతడు.. మార్చి 22న చెపాక్ స్టేడియం వేదికగా ఆర్సీబీతో మ్యాచ్తో బరిలోకి దిగనున్నాడు. మరోవైపు భారత్లో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న కోహ్లీ కూడా.. స్వల్ప విరామం తర్వాత నేరుగా ఐపీఎల్ లోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
Virat Kohli Vs Ms Dhoni ❤️
Ipl 2024 Opening Match – 22 March
Csk Vs RCB pic.twitter.com/GNUobpKVV4— Dheeraj Swarnkar (@MrDheerajsoni) February 22, 2024
ఈ రెండు జట్లకూ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంతవరకూ ట్రోఫీ గెలవకున్నా ఆర్సీబీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ప్రతి సీజన్కు ముందు ‘ఈ సాలా కప్ నమ్దే’ అనే స్లోగన్తో బరిలోకి దిగే ఆర్సీబీ.. చెపాక్లో తమ వేటను మరోసారి మొదలుపెట్టనుంది. ఈ ఇరుజట్ల మధ్య ఐపీఎల్లో ఇప్పటిదాకా 31 మ్యాచ్లు జరిగితే అందులో చెన్నై 20 మ్యాచ్లు గెలిచింది. బెంగళూరు పది మాత్రమే నెగ్గింది.