Ishant Sharma : అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లో ఎక్కువ కాలం కొనసాగాలంటే గణాంకాలను దృష్టి పెట్టుకోక తప్పదని భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma) పేర్కొన్నాడు. కెరీర్ తొలి నాళ్లలో అంకెల గురించి పట్టించుకోలేదని.. ఆ తర్వాత అది తప్పని తెలిసిందని ఇషాంత్ వెల్లడించాడు. అయితే తన కెరీర్ ప్రారంభమైన తీరు మాత్రం అనూహ్యమని ఇషాంత్ పేర్కొన్నాడు.
‘మా నాన్న విజయ్ శర్మ(Vijay Sharma) కూడా పేస్ బౌలరే. ఈ విషయం మా తాతయ్య చెప్పాడు. అయితే.. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక అవరోధాల వల్ల నాన్న క్రికెట్ను కెరీర్గా ఎంచుకోలేకపోయారు. ఆ లోటును నేను భర్తీ చేయాలని ముందే నిర్ణయించుకన్నా. అప్పట్లో ‘మొహల్లా’ జట్లు ఉండేవి. అలా చుట్టు పక్కలా ఎక్కడ మ్యాచ్ జరిగినా వాలిపోయేవాడిని. ఎత్తుగా ఉండటంతో ఆటోమెటిక్గా పేస్ బౌలర్ కావాల్సి వచ్చింది. చెప్పాలంటే అప్పట్లో పరిస్థితి అలాగే ఉండేది. రూ. 500 కోసం మ్యాచ్లు ఆడిన రోజులు కూడా ఉన్నాయి’ అని ఇషాంత్ పేర్కొన్నాడు.
ఇషాంత్ శర్మ
సుదీర్ఘ కాలం క్రికెట్లో కొనసాగాలంటే గణాంకాలపై దృష్టి పెట్టక తప్పదని ఇషాంత్ పేర్కొన్నాడు. 30 టెస్టు మ్యాచ్లు ఆడేంత వరకు తానెప్పుడు సగటు, స్ట్రయిక్ రేట్ గురించి ఆలోచించలేదని.. అయితే సుదీర్ఘ కాలం కెరీర్ ఉండాలంటే వాటిని పట్టించుకోవాల్సిందే అని అన్నాడు. చిన్నతనంలో ప్రతి ఒక్కరూ బ్యాటింగ్ చేసేందుకే ఇష్టపడే వారని.. దాని వల్ల కూడా తాను బౌలర్గా మారాల్సి వచ్చిందని లంబూ అభిప్రాయపడ్డాడు. టీమిండియా తరఫున 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడిన ఇషాంత్ శర్మ.. మూడు ఫార్మాట్లలో కలిపి 434 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరఫున ఇషాంత్ అదరగొట్టాడు. అతను ఆ తర్వాత విండీస్ సిరీస్లో కామెంటేటర్గా కొత్త అవతారం ఎత్తాడు.