న్యూఢిల్లీ: జాతీయ స్థాయి టోర్నీలో సత్తాచాటిన తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్.. రెండు ప్రపంచకప్లకు అర్హత సాధించింది. దేశ రాజధానిలో జరుగుతున్న జాతీయ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో శనివారం పసిడి పతకం సాధించడం ద్వారా ఇషా వరల్డ్కప్ చాన్స్ దక్కించుకుంది. వచ్చే నెల ఈజిప్ట్లో జరుగనున్న ప్రపంచకప్తో పాటు మార్చిలో భోపాల్ వేదికగా జరిగే మెగాటోర్నీల్లో ఇషా బరిలోకి దిగనుంది. ఈ రెండూ పారిస్ ఒలింపిక్స్ (2024) ర్యాంకింగ్ పాయింట్స్ టోర్నీలు కావడంతో.. విశ్వక్రీడలకు అర్హత సాధించే దిశగా ఇషా వడివడిగా అడుగులు వేస్తున్నది.