మ్యూనిచ్ : భారత స్టార్ షూటర్, హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో డబుల్ ధమాకా మోగించింది. రెండు వరల్డ్ రికార్డులు బ్రేక్ చేస్తూ 25 మీటర పిస్టల్ విభాగంలో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన ఇషా తాజాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం అందుకుంది. దాంతో ఈ మెగా టోర్నీలో రెండు వ్యక్తిగత పతకాలు నెగ్గిన భారత తొలి మహిళా షూటర్గా రికార్డుకెక్కింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల పిస్ట్ ఫైనల్లో భారత్కే చెందిన సురుచి ఇందర్ సింగ్ స్వర్ణ పతకం సాధించగా, ఇషా రజత పతకం గెలుచుకుంది. ఫైనల్లో సురుచి 242.1 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి వరుసగా రెండో ఏడాది స్వర్ణం గెలిచింది. ఇషా 241.2 పాయింట్లతో రజతం దక్కించుకుంది.
పురుషుల విభాగంలో భారత షూటర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ 592 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించినప్పటికీ, పోటీ ముగిసిన తర్వాత జరిగిన తుపాకీ తనిఖీలో కొలతల లోపాల కారణంగా దురదృష్టవశాత్తూ అతను అనర్హతకు గురయ్యాడు. ఇదే ఈవెంట్లో రుద్రాంక్ష్ పాటిల్ 585 పాయింట్లతో 53వ స్థానంలో నిలిచాడు.