Jasprit Bumrah: ఈ ఏడాది ముంబై ఇండియన్స్ హార్ధిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి బదిలీ చేసుకోవడం కొత్త చర్చలకు దారి తీస్తోంది. రోహిత్ తర్వాత కెప్టెన్సీ పదవి కోసమే పాండ్యా ముంబైకి వచ్చేందుకు ఆసక్తి చూపాడని కొందరు వాదిస్తుంటే మరికొందరు మాత్రం గుజరాత్ మేనేజ్మెంట్తో విభేదాల కారణంగా ఆ జట్టును వీడాడని గుసగుసలు వినిపించాయి. ఏదేమైనా పాండ్యా రీఎంట్రీ మాత్రం ముంబైలో సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు ఆగ్రహం తెప్పించిందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అతడు ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన స్టోరీ కూడా ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. రోహిత్ తర్వాత ముంబైకి సారథ్య పగ్గాల కోసం వేచి చూస్తున్న బుమ్రా.. తాజాగా పాండ్యా రీఎంట్రీతో హార్ట్ అయ్యాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
తాజాగా ఇదే విషయమై టీమిండియా దిగ్గజ ఆటగాడు కృష్ణమచారి శ్రీకాంత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “బుమ్రా ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్. అవి టెస్టులా లేక పరిమిత ఓవర్ల ఫార్మాటా అన్నది సంబంధం లేదు. ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్లో అతడు దేశం కోసం చేయాల్సిందంతా చేశాడు. 2022లో ఇంగ్లండ్ లో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన టెస్టుకు అతడు రోహిత్ గైర్హాజరీలో అతడు స్టాండ్ ఇన్ కెప్టెన్గా ఉన్నాడు…
కానీ తాజా పరిణామాల నేపథ్యంలో అతడు కచ్చితంగా హర్ట్ అయి ఉంటాడు. దానిని కోపం అనండి, మరేదైనా అనండి. బుమ్రా హర్ట్ అయింది మాత్రం వాస్తవం. చాలాకాలంగా అతడు జట్టు (ముంబై ఇండియన్స్) కోసం చేయాల్సిందంతా చేసినా అతడిని మోసం చేసినందుకు కచ్చితంగా బాధపడి ఉంటాడు..” అని తెలిపాడు. హార్థిక్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బుమ్రా ఇన్స్టా స్టోరీస్లో కొన్నిసార్లు సమాధానం చెప్పడం కంటే మౌనంగా ఉండటమే మంచిది అని పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అంతేగాక ఇన్స్టాలో ముంబై ఇండియన్స్ను అన్ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలతో బుమ్రా.. ముంబైని వీడతాడని, వేలంలోపే ఆ ప్రక్రియ మొదలుకానున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి బుమ్రా ఏం చేసేనో..?