IPL 2024 | భారత క్రికెట్కు కనకవర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ప్రత్యక్షంగా స్టేడియాలలో ఉండి చూసే ప్రేక్షకులతో పాటు టీవీలు, మొబైల్స్లో చూసేవారికోసం బీసీసీఐ, ప్రసారకర్తలు అయిన స్టార్, జియోలు కొత్త కొత్త టెక్నాలజీలతో మ్యాచ్లను మరింత ఉత్సాహంగా మార్చుతున్నాయి. డీఆర్ఎస్, గ్రౌండ్కు నలువైపులా అత్యాధునిక కెమెరాలు, హాక్ ఐ టెక్నాలజీ వంటి సాంకేతికతను ఉపయోగిస్తున్న బీసీసీఐ.. తాజాగా మరో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. రాబోయే సీజన్లో ‘స్మార్ట్ రిప్లై సిస్టమ్’ను తీసుకురానుంది. దీనిద్వారా రివ్యూలు, రిప్లేలకు సంబంధించిన నిర్ణయాలు వేగంగా మరింత పారదర్శకరంగా రానున్నాయి.
ఎందుకు..?
ఇన్నాళ్లు మ్యాచ్లలో బౌండరీ లైన్ దగ్గర బంతిని ఆపేటప్పుడు ఫీల్డర్ చేయి రోప్కు తాకిందా..? లేదా..?, రనౌట్, స్టంపౌట్ విషయంలో బ్యాటర్ బ్యాట్, కాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత గీతపై ఉంచాడా..? లేదా..? వంటి విషయాలలో థర్డ్ అంపైర్.. టీవీ బ్రాడ్కాస్ట్ డైరెక్టర్ను సంప్రదించేవాడు. టీవీ బ్రాడ్కాస్ట్ డైరెక్టర్.. హాక్ ఐ ఆపరేటర్ల దగ్గర్నుంచి సేకరించిన సమాచారాన్ని థర్డ్ అంపైర్కు అందజేసేవాడు. ఉదాహరణకు మ్యాచ్లు జరిగేప్పుడు ఫీల్డింగ్ టీమ్ ఏదైనా రివ్యూ కోరితే అప్పుడు సదరు వ్యక్తి.. ‘టీవీ అంపైర్ టు డైరెక్టర్’ అని చెప్పేవాడు. కానీ కొత్త సిస్టమ్ ద్వారా టీవీ బ్రాడ్కాస్ట్ డైరెక్టర్ అవసరం ఉండదు. ప్రస్తుతమున్న విధానం ద్వారా కొన్నికొన్నిసార్లు టీవీ అంపైర్ నిర్ణయం వెలువడటానికి కనీసం నిమిషం నుంచి రెండు నిమిషాల టైమ్ తీసుకునేది. ఎల్బీడబ్ల్యూ, క్యాచ్ అవుట్లలో కూడా ఇలాగే జరుగుతోంది. కానీ కొత్త విధానం ద్వారా దీనికి చెక్ పడనుంది.
IPL INTRODUCES SMART REPLAY SYSTEM …!!!
This will increase the accuracy and speed of decision making for the 3rd umpire. It’ll allow the TV umpire to refer to more visuals, including split-screen images. (Espncricinfo). pic.twitter.com/oOMsBYp49I
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024
ఎలా పని చేస్తుంది..?
స్టార్ట్ రిప్లై సిస్టమ్ లో టీవీ అంపైర్ దగ్గరే ఇద్దరు హాక్ ఐ ఆపరేటర్లు ఉంటారు. వీళ్లిద్దరూ గ్రౌండ్లో ఉండే 8 అత్యాధునిక హాక్ ఐ కెమెరాల ద్వారా సేకరించిన సమాచారాన్ని నేరుగా అతడికి అందజేస్తారు. విరివిగా ఉన్న కెమెరాల సాయంతో పలు యాంగిల్స్లో బంతిని పరిశీలించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో వాటిలో తప్పులు లేకుండా ప్రకటించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హాక్ ఐ ఆపరేటర్ల నుంచి స్ప్లిట్ స్క్రీన్ ఇమేజెస్, అత్యంత స్పష్టంగా ఉండే విజువల్స్ అంపైర్కు అందుతాయి. దీంతో అతడు నిర్ణయాలను వేగంగా వెల్లడించే అవకాశముంటుంది. ఈ కొత్త టెక్నాలజీని ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ అయిన చెన్నై – బెంగళూరు పోరులో ప్రవేశపెట్టనున్నారు.
బీసీసీఐ వర్క్షాప్..
ఈ విధానంపై బీసీసీఐ సంబంధిత నిపుణులతో రెండ్రోజుల వర్క్షాప్ నిర్వహించింది. సుమారు 15 మంది అంపైర్లు ఈ వర్క్ షాప్లో భాగమైనట్టు తెలుస్తోంది. ఈ స్మార్ట్ రిప్లై సిస్టమ్ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇదివరకే ‘ది హండ్రెడ్’ లీగ్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి సక్సెస్ అయింది.