అభిమానులను ఉర్రూతలూగించిన క్రికెట్ వేడుక ఐపీఎల్14 అంతిమ దశకు చేరుకుంది. లీగ్ దశలో ఎన్నో అనూహ్య పరిణామాల తర్వాత నాలుగు జట్లు ప్లేఆఫ్స్ చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్లేఆఫ్ చేరిన నాలుగు జట్ల సారధుల గురించి భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. ఇప్పుడు పోటీలో నిలిచిన నలుగురు కెప్టెన్లలో తన దృష్టిలో నెంబర్ వన్ ఎవరో తేల్చేశాడు.
ఎంఎస్ ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, రిషభ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ప్లేఆఫ్స్ చేరుకున్న సంగతి తెలిసిందే. వీరిలో మోర్గాన్ గురించి తొలిగా గంభీర్ విశ్లేషించాడు.
మోర్గాన్ కెప్టెన్సీపై పెదవి విరిచిన గంభీర్.. అతను జట్టుకు నాయకత్వం వహించడం లేదని విమర్శించాడు. ‘‘మోర్గాన్ విషయంలో వీడియో విశ్లేషకుడు సారధ్యం వహిస్తాడు. మోర్గాన్ అతన్ని చూస్తూ నిలబడతాడంతే. ఇక ఫీల్డ్లో అతను కెప్టెన్సీ చేస్తాడా? అనేది నాకు తెలీదు’’ అని గంభీర్ చురకలేశాడు.
ఆ తర్వాత ఆర్సీబీ సారధి విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాడు. కోహ్లీ సారధ్యం పట్ల గంభీర్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈసారి విరాట్ అద్భుతంగా రాణిస్తున్నాడని కితాబిచ్చాడు. ‘‘బహుశా సారధిగా ఇదే చివరి సీజన్ కాబట్టేమో? ఈసారి ఇంకా ఎంజాయ్ చేయాలని అనుకున్నట్లున్నాడు. మరింత రిలాక్స్డ్గా కనిపిస్తున్నాడు’’ అని మెచ్చుకున్నాడు.
పంత్ విషయానికొస్తే అతనికి స్టీవ్ స్మిత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి అనుభవజ్ఞుల అండదండలు ఉన్నాయని గంభీర్ చెప్పాడు. వీరి అనుభవాలపై ఆధారపడి జట్టును పంత్ ముందుకు నడిపించే అవకాశం ఉందన్నాడు. ఢిల్లీ జట్టులో ఆడే 11 మందిలో చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారని, ఇది అతనికి కొంత సానుకూల పరిణామమని అభిప్రాయపడ్డాడు.
అయితే ఒత్తిడిని తట్టుకోవడంలో ధోనీని మించిన వారెవరూ లేరని గంభీర్ స్పష్టం చేశాడు. ఢిల్లీ, చెన్నై జట్లు తొలి క్వాలిఫైయర్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధోనీవైపే గంభీర్ మొగ్గుచూపాడు. కాబట్టి ప్రస్తుతం ఉన్న సారధుల్లో తన నెంబర్ వన్ ధోనీ అని గంభీర్ స్పష్టంచేశాడు.