వినాయక్నగర్, మార్చి 20 : రోడ్లను ఊడ్చటం, డ్రైనేజీ కాలువల శుభ్రం.. నాలాల్లోని పూడిక తీత పనులు, ఇంటింటి వ్యర్థాల సేకరణ.. ఇలా అనునిత్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ.. నగర స్వచ్ఛతకు పాటుపడుతున్న సఫాయిల సేవలు వెలకట్టలేనివి. ఈ త్యాగధనుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పనిచేసే చోట తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నది. గ్లౌజులు, మాస్కులు అందించడమే కాదు.. వైద్య శిబిరాలను నిర్వహించి.. అవసరమైన వారికి మందులను పంపిణీ చేస్తున్నది. మహిళా కార్మికులకు బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టులు సైతం నిర్వహిస్తున్నది.
కార్మికులకు వైద్య పరీక్షలు
అల్వాల్ సర్కిల్ పరిధిలో 420మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతిరోజు రోడ్లను ఊడ్చటంతో పాటు చెత్తను సేకరిస్తున్నారు. 63 ఆటోట్రాలీలతో ఇంటింటికీ తిరిగి తడి పొడి చెత్తను సేకరిస్తున్నారు. కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం మాస్కులు, గ్లౌజ్లు అందజేసింది. అయితే వీటిని వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యాధికారి డా హెలెన్ నిర్మల తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారు పనిచేస్తున్న ప్రదేశాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఎవరైతే రక్షణ కవచాలను వాడరో వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఆరు నెలల్లో పది సార్లు నిర్వహించిన వైద్య శిబిరాల్లో కార్మికులకు చికిత్సలు అందజేశారు. చర్మ వ్యాధులు, ఊపిరి తిత్తుల వ్యాధులను గుర్తించడం కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమై వారికి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. మహిళా కార్మికుల కోసం గత వారం కిందట 150మందికి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షలన్నీ సాధారణంగా ఉండటంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.