IPL Mini Auciton : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్కు మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది. అంతకంటే ముందు మినీ వేలం అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 17వ సీజన్ కోసం డిసెంబర్ 19న దుబాయ్లో మినీ వేలం(IPL Mini Auciton) జరుగనుంది. దాంతో, వేలంలో పేర్లు నమోదు చేసుకున్న క్రికెటర్ల వివరాలను శుక్రవారం బీసీసీఐ వెల్లడించింది.
ఈసారి 1,166 మంది పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. వీళ్లలో 830 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ మొత్తం జాబితాలో 212 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా.. 909 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు. అయితే.. మరింత మంది ప్లేయర్లను లిస్ట్లో చేర్చడంపై స్పందించాలని బీసీసీఐ 10 ఫ్రాంచైజీలను కోరింది. ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలం ఆసక్తికరంగా ఉండనుంది. వన్డే ప్రపంచ కప్లో పరుగుల వరద పారించిన రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా), డారిల్ మిచెల్(న్యూజిలాండ్), ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)లు తమ పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు.
రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్
అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా 77 మంది కోసం ఈసారి 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. వీళ్లలో 30 మంది విదేశీ ఆటగాళ్లు ఉండనున్నారు. ఆసీస్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్లకు రూ. 2 కోట్ల కనీస ధర నిర్ణయించారు. రచిన్ రవీంద్ర రూ. 50 లక్షల కనీస ధరలో ఉన్నాడు. ఈసారి రవీంద్ర భారీ ధర పలికే అవకాశం ఉంది. అతడితో పాటు అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్థాన్) కూడా డిమాండ్ ఉన్న ఆటగాడే. నిరుడు మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్లో చెలరేగిన అతడిని పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు కొన్నది. ఐపీఎల్ చరిత్రలో ఒక ప్లేయర్కు అంత ధర పెట్టడం అనేది ఒక రికార్డు.