ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలాన్ని గతేడాది దుబాయ్లో అట్టహాసంగా నిర్వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఏడాది జరగాల్సి ఉన్న మెగా ఆక్షన్ను మరోసారి అరబ్బుల అడ్డాలోనే జరిపించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. ఐపీఎల్-2025 వేలాన్ని సౌదీ అరేబియా రాజధాని రియాద్లో నిర్వహించనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. మెగా వేలానికి సంబంధించి తేదీలపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినప్పటికీ నవంబర్ 24, 25 తేదీలలో ఆక్షన్ను నిర్వహిస్తామని అన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇది వరకే సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ క్రికెటర్లు ఈసారి వేలంలోకి వస్తుండటంతో వేలం ప్రక్రియపై ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవలే పది ఫ్రాంచైజీలు వచ్చే సీజన్లో తాము అట్టిపెట్టుకోబోయే ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. రిటెన్షన్లో ఫ్రాంచైజీలు 46 మంది ఆటగాళ్లకు రూ. 558.5 కోట్లు ఖర్చు చేశాయి.
204 స్లాట్స్ అందుబాటులో ఉన్న వేలంలో రిటెన్షన్కు పోగా మరో రూ. 641.5 కోట్ల నగదు ఫ్రాంచైజీల వద్ద ఉంది. వేలంలో ఏ ఆటగాడు ఎంత దక్కించుకుంటానే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సరిగ్గా వేలం జరిగే సమయానికే భారత క్రికెట్ జట్టు ఆసీస్ టూర్లో తొలి టెస్టు (నవంబర్ 22 నుంచి ప్రారంభం) ఆడనున్న నేపథ్యంలో ప్రసారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా మధ్యాహ్నం సమయంలో వేలం నిర్వహించనున్నట్టు సమాచారం.