ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ ఆరంభానికి ముందు కరోనా వైరస్ కలవరపెడుతున్న ది. మహారాష్ట్రలో కొవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండటంతో పాటు వాంఖడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి, ఈవెంట్ మేనేజ్మెంట్కు సంబంధించిన ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఒకవేళ పరిస్థితి చేయిదాటితే ముంబైలో జరుగాల్సిన 10 మ్యాచ్లను హైదరాబాద్, ఇండోర్లలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డా ఇబ్బంది లేదు. ఆటగాళ్లు బయో బబుల్లో ఉన్నారు. ప్రేక్షకులకు ఎలాగో అనుమతి లేదు. కాబట్టి ముంబైలో తొలి దశ మ్యాచ్లు సజావుగానే సాగుతాయనుకుంటున్నా. ఒకవేళ అవసరమైతే హైదరాబాద్, ఇండోర్ స్టాండ్బై వేదికలుగా సిద్ధంగా ఉన్నాయి’ అని అన్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు అక్షర్ పటేల్కు కరోనా పాజిటివ్ అని తేలింది.