Wasim Jaffer : దేశవాళీ క్రికెట్ సీజన్ 2026-27 ఆరంభానికి ముందు హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) కీలక నిర్ణయం తీసుకుంది. రంజీ దిగ్గజమైన వసీం జాఫర్ (Wasim Jaffer)ను మెంటర్గా నియమించింది. ఏకంగా పదిసార్లు రంజీ ఛాంపియన్గా రికార్డు నెలకొల్పిన జాఫర్.. లయ తప్పిన హైదరాబాద్ జట్టును సానబెట్టడంపై, టీమ్లో విజయకాంక్షను రగిల్చడంపై దృష్టి సారించనున్నాడు. రెండేళ్లు మెంటర్గా కొనసాగనున్న ఈ వెటరన్ ఆటగాడు.. సీనియర్, జూనియర్ స్థాయి జట్లను తీర్చిదిద్దనున్నాడు.
ఈమధ్య కాలంలో దేశవాళీ క్రికెట్లో నిరాశపరుస్తున్న హైదరాబాద్ జట్టుకు మహర్ధశ రానుంది. దేశవాళీలో.. ముఖ్యంగా రంజీల్లో పరుగుల వీరుడైన వసీం జాఫర్ మెంటర్గా రావడమే అందుకు కారణం. ఇటీవలే అంబటి రాయుడును హైదరాబాద్ క్రికెట్ వ్యవహారాలను చూసుకొనే బాధ్యతలు అప్పగించిన హెచ్సీఏ.. అనుభవజ్ఞుడైన జాఫర్ను మెంటర్గా తీసుకుంది. అయితే.. రాయుడు ప్రోద్భలంతోనే జాఫర్ను ఈ పదవికి ఎంపిక చేసినట్టు సమాచారం.
Hyderabad have appointed Wasim Jaffer, the former India batter, as a mentor ahead of the 2026-27 domestic season pic.twitter.com/bigqO1FRC7
— Cricinfo (@cricinfo) June 30, 2026
ఆరేళ్ల క్రితం(2026లో) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన జాఫర్ దేశవాళీలో పలు జట్లకు మెంటర్గా, కోచ్గా సేవలందించాడు. విదర్భ, ఉత్తరాఖండ్, ఒడిశా, పంజాబ్ ఆటగాళ్లను సానబెట్టిన జాఫర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) బ్యాటింగ్ కోచ్గానూ పనిచేశాడు. అంతేకాదు బంగ్లాదేశ్ క్రికెట్కు కన్సల్టెంట్గానూ వ్యవహరించాడీ మాజీ ఓపెనర్.
నిరుడు రంజీ సీజన్ 2025-26లో హైదరాబాద్ జట్టు ఘోరంగా నిరాశపరిచింది. ముగ్గురు కెప్టెన్ల(తిలక్ వర్మ, జి.రాహుల్ సింగ్, సిరాజ్) నేతృత్వంలో ఆడినా.. ఎలైట్ గ్రూప్ డీలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. విజయ్ హజారే ట్రోఫీలోనైతే లీగ్ దశను కూడా దాటలేదు. కానీ, సీవీ మిలింద్ సారథ్యంలోని హైదరాబాద్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆకట్టుకుంది.