IPL 2026 : పంతొమ్మిదో సీజన్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్పై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. లీగ్ దశ మ్యాచ్లు సగంపైగా పూర్తైనందున నాకౌట్ పోరాటాలకు వేదికలను నిర్ణయించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇదే అంశంపై శనివారం బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devjit Saikia) మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో ప్లే ఆఫ్స్ వేదికలను ఖరారు చేస్తామని వెల్లడించాడు.
భారీ స్కోర్ల మ్యాచ్లు, ఉత్కంఠ పోరాటాలతో అభిమానులను అలరిస్తున్న లీగ్ దశ ముగియక ముందే ప్లే ఆఫ్స్ షెడ్యూల్ రానుంది. మమే ఆఖరున ఫైనల్ మ్యాచ్ ఉన్నందున.. ప్లే ఆఫ్స్ వేదికలు, షెడ్యూల్పై బీసీసీఐ దృష్టి సారించింది. మహిళల పొట్టి ప్రపంచకప్ స్క్వాడ్ ప్రకటించిన సందర్భంగా సైకియా మీడియాతో మాట్లాడుతూ ప్లే ఆఫ్స్ షెడ్యూల్పై హింట్ ఇచ్చాడు. ‘ఐపీఎల్ ప్లే ఆఫ్స్, ఫైనల్కు అనువైన వేదికలపై మేము దృష్టి పెట్టాం. రాబోయే రెండు రోజుల్లో ప్లే ఆఫ్స్పై ప్రకటన చేస్తాం’ అని సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపాడు.
#IPLupdate | BCCI secretary Devajit Saikia confirmed that the schedule for the IPL playoffs and the final will be announced in two days. He also played down concerns about the batting-heavy nature of the ongoing edition of the tournament.@shamik100 ✍️
https://t.co/8EoH2FDi0L— RevSportz Global (@RevSportzGlobal) May 2, 2026
గత సీజన్ ఫైనల్ ఆడిన ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ సొంత మైదానాల్లో ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఉంటాయా? అనే ప్రశ్నకు బదులిచ్చేందుకు సైకియా నిరాకరించాడు. ‘మీరు తోచినట్టు ఊహిస్తూనే ఉండండి. కానీ, నేను మాత్రం బదులివ్వను. రెండు రోజుల్లో ప్లే ఆఫ్స్ వేదికలపై నిర్ణయం తీసుకుంటాం’ అని సైకియా పేర్కొన్నాడు.
తొలుత ప్రకటించిన తేదీల ప్రకారం మే 31తో పంతొమ్మిదో సీజన్ ముగియనుంది. దాంతో, మే 26న క్వాలిఫయర్ 1, మే 27వ తేదీన ఎలిమినేటర్, మే 29న క్వాలిఫయర్ 2 మ్యాచ్లు నిర్వహించే అవకాశముంది. ముందుగా నిర్ణయించిన మే 31న టైటిల్ పోరు జరుగనుంది.

పద్దెనిమిదో సీజన్లో హైదరాబాద్ వేదికగా జరగాల్సిన క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్కు ముల్లన్పూర్ వేదికైంది. ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత దృష్ట్యా కోల్కతాలో ఆడించాల్సిన క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్లను అహ్మదాబాద్కు తరలించిన విషయం తెలిసిందే.