లక్నో: ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేయలేకపోయింది. వర్షం కారణంగా పిచ్పై తేమ ఉండటంతో LSG జట్టుకు పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. దాంతో 19.2 ఓవర్లలో LSG టీమ్ 7 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రత్యర్థి జట్టు CSK ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 20వ ఓవర్లో బంతులు పడగానే వర్షం పడటంతో ఆట నిలిచిపోయింది. దాంతో అంతటితో LSG ఇన్నింగ్స్ ముగిసినట్లు మ్యాచ్ స్టాట్స్ మ్యాన్ దీపూ నారాయణన్ ప్రకటించారు. CSK లక్ష్యాన్ని 19 ఓవర్లలో 127 పరుగులుగా నిర్ధారించారు. మ్యాచ్ 40 నిమిషాల్లో తిరిగి ప్రారంభమైతే ఓవర్లలో కోత అవసరం ఉండదని ఆయన వెల్లడించారు.
కాగా, ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి లక్నో సూపర్ జెయింట్స్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. పిచ్పై తేమ అధికంగా ఉన్నందున తాను ఫీల్డింగ్ ఎంచుకున్నానని చెప్పాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన LSGకి ఇన్నింగ్స్లో నాలుగో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. మొయిన్ అలీ బౌలింగ్లో ఓపెనర్ కైల్ మేయర్స్ (14) రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత ఐదో ఓవర్లో మహీశ్ తీక్షణ మరో ఓపెనర్ మనన్ వోహ్రా, కెప్టెన్ కృనాల్ పాండ్యాలను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. అప్పటికి LSG స్కోర్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు మాత్రమే. ఆ తర్వాత కూడా LSG వికెట్ల పతనం ఆగలేదు. ఏడో ఓవర్ ఐదో బంతికి రవీంద్ర జడేజా బౌలింగ్లో మార్కస్ స్టోయినిస్ ఔటయ్యాడు.
ఆ తర్వాత 10వ ఓవర్ నాలుగో బంతికి మొయిన్ అలీ బౌలింగ్లో కరన్ శర్మ రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అప్పటికి జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 44 పరుగులు మాత్రమే. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదోనీ (59), నికోలస్ పూరన్ (20)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. LSG బ్యాటర్లలో బదోనీ ఒక్కడే 100కు పైగా స్ట్రైక్ రేట్తో ఆడాడు. కేవలం 33 బంతుల్లో బదోనీ 59 పరుగులు రాబట్టడంతో LSG ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్ను చేయగలిగింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మొయిన్ అలీ, మహీశ్ తీక్షణ, మతీశ పతిరన తలా రెండు వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.