క్రికెట్ పండుగ ఐపీఎల్. ఈ మాట అతిశయోక్తేమీ కాదు. ఆటగాళ్ల నుంచి బ్రాడ్కాస్టర్ల వరకూ అందరికీ కాసుల వర్షం కురిపించే ఈ లీగ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పేరు తెలియని ఆటగాళ్లను కూడా ఒక్క రోజులో స్టార్లను చేసే సత్తా ఈ టోర్నీ సొంతం. అందుకే దీనిలో ఆడేందుకు చాలామంది ఆటగాళ్లు ఉత్సాహం చూపుతారు.
ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఈసారి ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లను చేర్చడంతోపాటు.. మెగా వేలం నిర్వహించాలని ఐపీఎల్ యాజమాన్యం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో మొత్తం పది జట్లు కలిపి 217 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ స్థానాల కోసం పోటీ విపరీతంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకూ ఈ 217 స్థానాల కోసం మొత్తం 1214 మంది ఆటగాళ్లు దరఖాస్తులు చేసుకున్నారని సమాచారం. వీరిలో 318 మంది విదేశీయులున్నారు. మిగతా వారిలో 270 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 903 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, 41 మంది అసోసియేట్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఐపీఎల్ మెగా వేలం వచ్చే నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ కొన్నిరోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే.