ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు ఆల్ రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ నిర్దేశించిన 190 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులకే పరిమితమైంది.
ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. వార్నర్ 38 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ రిషన్ పంత్ (17 బంతుల్లో 34 పరుగులు) రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. హసరంగ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు భారీ స్కోర్ నమోదు చేసింది. ఆరంభంలో తడబడినప్పటికీ చివర్లో పుంజుకొని ఛాలెంజింగ్ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. పంత్ సేన ముందు 190 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
బెంగళూరు బ్యాటర్స్లో దినేశ్ కార్తిక్ (34 బంతుల్లో 66 నాటౌట్), మ్యాక్స్వెల్ (34 బంతుల్లో 55), హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దినేశ్ కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ చివరిదాకా నిలబడ్డాడు. కార్తిక్ స్కోర్ లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. గ్లెన్ మ్యాక్స్వెల్ 34 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కార్తీక్కి తోడుగా షాబాజ్ అహ్మద్(32) కూడా ఆఖర్లో ధాటిగా ఆడాడు. కెప్టెన్ డు ప్లెసిస్ (8), అనుజ్ రావత్ (0), విరాట్ కోహ్లీ (12), సుయశ్ ప్రభుదేశాయ్ (6) విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఒక అరుదైన ఫీట్ సాధించడం విశేషం. ఆర్సీబీతో మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన వార్నర్ 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్సీబీపై తాజా హాఫ్ సెంచరీతో కలిపి వార్నర్ మొత్తం 10 అర్థసెంచరీలు సాధించాడు. అంతకముందు పంజాబ్ కింగ్స్పై కూడా వార్నర్ 11 అర్థసెంచరీలు సాధించాడు.