ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఆరంభంలోనే తడబడింది. 20 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు గుజరాత్ నష్టపోయింది. తొలి ఓవర్లోనే శుభ్మన్ గిల్ (0), రెండో ఓవర్లో శంకర్ (0) డకౌట్ కాగా.. 4వ ఓవర్లో అభినవ్ మనోహర్ (12) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత వృద్ధిమాన్ సాహా కూడా 11(18) ఔటయ్యాడు. పది ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోరు 58/4. డేవిడ్ మిల్లర్(27 నాటౌట్), రాహుల్ తెవాతియా(2 నాటౌట్) క్రీజులో ఉన్నారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమవ్వడంతో గుజరాత్ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉంది.
మ్యాచ్ ఆరంభంతో టాస్ నెగ్గిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 170 పరుగుల టార్గెట్ ఉంది.
చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగిఆడాడు. 48 బంతుల్లో 73 పరుగులు చేసి తన ఖాతాలో హాఫ్ సెంచరీ వేసుకున్నాడు. రుతురాజ్ స్కోర్లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. రుతురాజ్తో పాటు అంబటి రాయుడు కూడా వేగంగా పరుగులు రాబట్టాడు. 31 బంతుల్లో 46 పరుగులతో మెరిశాడు. కానీ హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. కెప్టెన్ జడేజా (22), శివమ్ దూబే (19 నాటౌట్) రాణించగా.. రాబిన్ ఉతప్ప (3), మొయిన్ అలీ (1) నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో జోసెఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, షమీ చెరో వికెట్ తీశారు.
గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై జట్టు 169 పరుగులకే పరిమితమైంది. గైక్వాడ్, అంబటి రాయుడు కలిసి 92 పరుగులను జోడించారు. అయితే దూకుడుగా ఆడుతున్న వీరిద్దరూ ఔట్ కావడంతో స్కోరుబోర్డు నెమ్మదించింది.