ఫేవరెట్లుగా సీజన్ షురూ చేసిన మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టిక అట్టడుగున కొనసాగుతుంటే.. సమిష్టి ప్రదర్శనతో బెంగళూరు దుమ్మురేపుతున్నది. లీగ్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లాడిన బెంగళూరు ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది! బ్యాట్తో ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే.. బంతితో హజిల్వుడ్ లక్నోకు చుక్కలు చూపాడు!
ముంబై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు.. ఐపీఎల్ 15వ సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (64 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. మ్యాక్స్వెల్ (23), షాబాజ్ అహ్మద్ (26) ఫర్వాలేదనిపించారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) గోల్డెన్ డకౌట్గా వెనుదిరగగా.. అనూజ్ రావత్ (4), ప్రభుదేశాయ్ (10) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో జాసెన్ హోల్డర్, దుష్మంత చమీర చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులకు పరిమితమైంది. కృనాల్ పాండ్యా (42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ కేఎల్ రాహుల్ (30) పోరాడినా ఫలితం లేకపోయింది. బెంగళూరు బౌలర్లలో హజిల్వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. డుప్లెసిస్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా బుధవారం జరుగనున్న పోరులో ఢిల్లీతో పంజాబ్ తలపడనుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు తొలి ఓవర్లోనే డబుల్ షాక్ తగిలింది. చమీరా వేసిన ఐదో బంతికి అనూజ్ రావత్ ఔట్ కాగా.. ఆఖరి బాల్కు విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. ఎదుర్కొన్న తొలి బంతినే శరీరానికి దూరంగా ఆడిన విరాట్.. బ్యాక్వర్డ్ పాయింట్లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఉన్నంత సేపు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన మ్యాక్స్వెల్.. చమీరా వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు ఓ సిక్సర్ బాదాడు. ఇక ఇన్నింగ్స్ గాడిన పడ్డట్లే అనుకుంటున్న దశలో హోల్డర్ ఓ సూపర్ క్యాచ్తో మ్యాక్స్వెల్ను పెవిలియన్కు పంపాడు. ఫలితంగా పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు 47/3తో నిలిచింది. సుయాశ్ ప్రభుదేశాయ్ ఎక్కువసేపు నిలువలేకపోగా.. షాబాజ్ అహ్మద్ కెప్టెన్కు కాస్త సహకరించాడు. లక్నో బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేస్తుండటంతో ఆరంభంలో ఆచితూచి ఆడిన డుప్లెసిస్.. అడపాదడపా బౌండ్రీలతో 40 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కృనాల్ ఓవర్లో 4,6తో డుప్లెసిస్ జోరు పెంచగా.. షాబాజ్ అహ్మద్ రనౌట్ రూపంలో డగౌట్ బాట పట్టాడు. వీరిద్దరూ ఐదో వికెట్కు 70 పరుగులు జోడించారు. ఈ సీజన్లో ఫుల్ జోష్లో ఉన్న దినేశ్ కార్తీక్ క్రీజులో అడుగుపెట్టడంతో బెంగళూరు భారీ స్కోరు చేయడం ఖాయమే అనుకున్నా.. చివరి వరకు లక్నో బౌలర్లు మ్యాచ్పై తమ పట్టు కొనసాగించారు. రవి బిష్ణోయ్ ఓవర్లో రెండు ఫోర్లతో సెంచరీకి చేరువైన డుప్లెసిస్.. ఐపీఎల్లో తొలి శతకానికి నాలుగు పరుగుల దూరంలో వెనుదిరిగాడు.
బెంగళూరు: 20 ఓవర్లలో 181/6 (డుప్లెసిస్ 96, షాబాజ్ 26; హోల్డర్ 2/25, చమీర 2/31),
లక్నో: 20 ఓవర్లలో 163/8 (కృనాల్ 42, రాహుల్ 30; హజిల్వుడ్ 4/25, హర్షల్ 2/47).