ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఢిల్లీ బ్యాటర్లు మొదట్లో దూకుడుగా ఆడినా.. పృథ్వీ షా వికెట్ కోల్పోయాక ఆచితూచి ఆడుతున్నారు. ఏడో ఓవర్లో హర్షల్ పటేల్ ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. హసరంగ వేసిన ఎనిమిదో ఓవర్లో డేవిడ్ వార్నర్(54) ఓ సిక్స్ కొట్టాడు. ఆ తరువాతి ఓవర్లో ఒక సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వార్నర్తో పాటు మిచెల్ మార్ష్(7) క్రీజులో ఉన్నాడు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ ఒక వికెట్ కోల్పోయి 79 పరుగులు చేసింది.
అంతకుముందు లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. పవర్ ప్లే పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు 57/1 గా ఉంది. కానీ సిరాజ్ వేసిన ఐదో ఓవర్లో భారీ షాట్ కొట్టబోయిన పృథ్వీ షా(16).. అనుజ్ రావత్ చేతికి చిక్కాడు.
మ్యాచ్ ఆరంభంలో టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు భారీ స్కోర్ నమోదు చేసింది. ఆరంభంలో తడబడినప్పటికీ చివర్లో పుంజుకొని ఛాలెంజింగ్ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. పంత్ సేన ముందు 190 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
బెంగళూరు బ్యాటర్స్లో దినేశ్ కార్తిక్ (34 బంతుల్లో 66 నాటౌట్), మ్యాక్స్వెల్ (34 బంతుల్లో 55), హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దినేశ్ కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ చివరిదాకా నిలబడ్డాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడుగా ఆడిన దినేశ్ కార్తిక్.. ముస్తాఫిజుర్ రహ్మాన్ వేసిన 18వ ఓవర్లో మరింత చెలరేగి ఆడాడు. ఏకంగా నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు బాది.. ఒకే ఓవర్లో 28 పరుగులు రాబట్టాడు. కార్తిక్ స్కోర్ లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. గ్లెన్ మ్యాక్స్వెల్ 34 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కార్తీక్కి తోడుగా షాబాజ్ అహ్మద్(32) కూడా ఆఖర్లో ధాటిగా ఆడాడు. కెప్టెన్ డు ప్లెసిస్ (8), అనుజ్ రావత్ (0), విరాట్ కోహ్లీ (12), సుయశ్ ప్రభుదేశాయ్ (6) విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.