IPL-2022 | ఐపీఎల్-2022లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) శుభారంభాన్ని అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) విధించిన 132 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి సాధించింది. కోల్కతా బ్యాట్స్మెన్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. ఓపెనర్ అజింక్య రహానే 34 బంతుల్లో 44 పరుగులు చేశాడు. వాటిలో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ నిలకడగా ఆడుతూ రహానేకు మద్దతుగా నిలిచి 16 పరుగులు చేశాడు. పవర్ప్లే ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా ఓపెనర్లు 43 పరుగులు చేశారు.
బ్రావో బౌలింగ్లో వెంకటేశ్ అయ్యర్.. సీఎస్కే కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నితీశ్ రాణా 21 పరుగులు చేశాక.. బ్రావో బౌలింగ్లో బంతిని అంబటి రాయుడికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరుకున్నాడు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన సారధి శ్రేయస్ అయ్యర్, రహానేతో కలిసి నిలకడగా ఆడాడు. కానీ మిచెల్ శాంటర్న్ బౌలింగ్లో రహానే ఔటయ్యాడు. రహానే స్థానే వచ్చిన శ్యామ్ బిల్లింగ్స్ 25 పరుగులు చేశాడు. తర్వాత షెల్టన్ జాక్సన్తో కలిసి శ్రేయాస్ అయ్యర్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. సీఎస్కే బౌలర్లలో డ్వెన్ బ్రావో మూడు, మిచెల్ శాంటర్న్ ఒక వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే ఐదు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. మిస్టర్ కూల్ ధోనీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 2019 తర్వాత ఐపీఎల్లో ధోనీ హాఫ్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. రాబిన్ ఊతప్ప 28, కెప్టెన్ రవీంద్ర జడేజా 26 పరుగులతో పర్వాలేదనిపించారు. ఓపెనర్లలో రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ కాగా, డెవాన్ కాన్వేను మూడు పరుగులకే ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు.