ఐపీఎల్ 2022 లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో చివరి బంతి వరకూ ఆడి మూడు వికెట్లతో విజేతగా నిలిచింది. చివరి ఓవర్లో ధోనీ వన్ మేన్ షో చూపించాడు. ఆ ఓవర్లో 17 పరుగులు కొట్టాల్సి ఉండగా.. ఒక సిక్స్, రెండు ఫోర్లతో మ్యాచ్ హైడ్రామాను ముగించాడు. ధోనీ (28 పరుగులు 13 బంతుల్లో – ఒక సిక్స్, 3 ఫోర్లు) చివరి వరకూ నిలబడి మరోసారి ప్రపంచంలోనే ఉత్తమ మ్యాచ్ ఫినిషర్ నిరూపించుకున్నాడు. ధోనీ తరువాత చెన్నై బ్యాటర్లలో అంబటి రాయుడు(40), రాబిన్ ఉతప్ప (30), ప్రిటోరియస్ (22) రాణించారు. ముంబై బౌలర్లో డనియల్ సామ్స్ 4 వికెట్లు, జయదేవ్ 2, మెరెడిత్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్తో చెన్నై ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ముంబై వరుసగా ఏడో ఓటమి మూట గట్టుకుంది. చెన్నై పేసర్ ముకేశ్ చౌదరి (మూడు వికెట్లు) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
అంతకుముందు మ్యాచ్ ఆరంభంలో టాస్ నెగ్గిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై ముందు 156 పరుగుల టార్గెట్ ఉంచింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. తిలక్ వర్మ 43 బంతుల్లో 51 పరుగులు (3 ఫోర్లు, రెండు సిక్స్లతో) చేశాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి మూడు వికెట్లు పడగొట్టాడు. డ్వేన్ బ్రావో రెండు వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్, మహీశా తీక్షణ చెరో వికెట్ తీశారు.
కీలక మ్యాచ్లోనూ మాజీ ఛాంపియన్ అయిన ముంబై ఆటతీరు మారలేదు. ముంబై కీలక బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. అటు చేతికి చిక్కిన క్యాచ్ లను చెన్నై చేజార్చుకుంది. కాగా.. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (51 నాటౌట్) కాకుండా సూర్యకుమార్ యాదవ్ (32), హృతిక్ షోకీన్ (25) మాత్రమే ఫర్వాలేదనిపించారు. రోహిత్ (0), ఇషాన్ కిషన్ (0) డకౌట్ కాగా.. బ్రెవిస్ (4), కీరన్ పొలార్డ్ (12), డానియల్ సామ్స్ (5 నాటౌట్) విఫలమయ్యారు. చివర్లో జయ్దేవ్ ఉనద్కత్ (19 నాటౌట్.. ఒక సిక్స్, ఒక ఫోర్)తో తిలక్ వర్మ 16 బంతుల్లో 35 పరుగులు జోడించాడు. చెన్నై ఫీల్డర్లు నాలుగు క్యాచ్లను డ్రాప్ చేశారు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో చెన్నైకి మంబై ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించగలిగింది.