షార్జా: కోల్కతా నైట్ రైడర్స్ మాజీ సారధి, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేశ్ కార్తీక్ను బీసీసీఐ మందలించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన రెండో క్వాలిఫైయర్లో అతను ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే అతను ఏ నిబంధనను ఉల్లంఘించిందీ మాత్రం బయటపెట్టలేదు.
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని 2.2 సెక్షన్లోని లెవెల్ 1 తప్పిదం చేసినట్లు కార్తీక్ కూడా అంగీకరించినట్లు బీసీసీఐ తెలిపింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన రెండో క్వాలిఫైయర్లో దినేశ్ కార్తీక్ ఒక్క పరుగూ చేయకుండానే వెనుతిరిగాడు. అయితే ఆ సమయంలోనే కోపంతో ఒక వికెట్ను చేత్తో కొట్టి పడేసినట్లు కనిపిస్తోంది. ఈ కారణంగానే అతన్ని బీసీసీఐ మందలించినట్లు కొందరు భావిస్తున్నారు.
కాగా, ఏడేళ్ల తర్వాత మళ్లీ కోల్కతా జట్టు ఐపీఎల్ ఫైనల్ చేరింది. రెండో క్వాలిఫైయర్లో ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం అందివ్వడంతో కోల్కతా జట్టు సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వరకూ మ్యాచ్ సాగింది.
ఢిల్లీ బౌలర్లు చివరి ఓవర్లలో విజృంభించడంతో కోల్కతా బ్యాట్స్మెన్ స్కోరు చేయలేకపోయారు. దానికితోడు వికెట్లు కూడా టపటపా పడిపోయాయి. ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్లో సిక్సర్ బాదిన యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠి తన జట్టును ఐపీఎల్ ఫైనల్స్ చేర్చాడు.