ముంబై: ఐపీఎల్ 14లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ దుమ్మురేపింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(61: 51 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), మయాంక్ అగర్వాల్(69: 36 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు) హాఫ్సెంచరీలతో విజృంభించడంతో పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ ఆద్యంతం వీరిద్దరూ అద్భుత బ్యాటింగ్తో అలరించారు. చివర్లో దీపక్ హుడా(22 నాటౌట్), షారుక్ ఖాన్(15 నాటౌట్) మెరిశారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, మెరీవాలా, రబాడ, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు.
పంజాబ్కు అదిరిపోయే ఆరంభం లభించింది. మయాంక్ వేగంగా ఆడుతూ ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ రాహుల్ కూడా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో పవర్ప్లే ఆఖరికి 59/0తో నిలిచింది. రన్రేట్ 10కి తగ్గకుండా చకచకా రన్స్ రాబట్టడంతో కింగ్స్ భారీ స్కోరు చేయగలిగింది. రబాడ వేసిన 11వ ఓవర్లో మయాంక్ వరుసగా రెండు సిక్సర్లు, రాహుల్ సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ఇదే ఓవర్లో జట్టు స్కోరు 110 దాటింది. మెరీవాలా బౌలింగ్లో అగర్వాల్ ఔటవడంతో తొలి వికెట్కు 122 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
రబాడ వేసిన 16వ ఓవర్లో రాహుల్ ఔట్ కాగా, క్రిస్ వోక్స్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే సిక్స్ బాది జోరుమీదున్న క్రిస్గేల్(11) వెనుదిరిగాడు. నికోలస్ పూరన్ ఈ మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. డెత్ ఓవర్లలో ఢిల్లీ కట్టుదిట్టంగా బంతులేస్తున్నా దీపక్ హుడా, షారుక్ ఖాన్ చెలరేగి జట్టు స్కోరు 190 దాటించారు.