Asian Games : ఆసియా క్రీడల్లో క్రికెటర్ల సౌకర్యార్థం మౌలిక వసతులు లేకపోవడంపై అసంతృప్తితో ఉన్న బీసీసీఐ(BCCI)కి భారత ఒలింపిక్ సంఘం (IOA) షాకిచ్చింది. జపాన్లోని ఐచీ- నగోయాలో టెంట్లోనే డ్రెస్సింగ్ రూమ్, 500 మీటర్ల దూరంలో వాష్రూమ్పై భారత బోర్డు ఫిర్యాదును తిరస్కరించింది. నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాటితోనే సర్దుకుపోవాలని సూచించింది ఐఓఏ. ఒకవేళ టీమిండియా క్రికెటర్లకు ఇబ్బందిగా ఉంటుందని భావిస్తే.. సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేసుకోవచ్చని పేర్కొంది. దాంతో.. టోర్నీ నిర్వాహకులను నమ్ముకునే కంటే భారత ప్లేయర్ల కోసం మెరుగైన వసతులు కల్పించడంపై బీసీసీఐ దృష్టి సారించనుంది.
సెప్టెంబర్ 19వ తేదీ నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు మొదలవ్వనున్నాయి. అయితే.. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే అథ్లెట్లు, క్రికెటర్లకు వసతులు, ఏర్పాట్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. టెంట్లలో లేదా కంటైనర్లలో వసతి, ఆమడ దూరంలో టాయిలెట్లు.. వంటివి క్రికెటర్లకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని వాపోతున్న బీసీసీఐకి కీలక సూచన చేసింది భారత ఒలింపిక్ సంఘం. టైమ్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. వసతులపై అభ్యంతరం ఉంటే సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు అభ్యంతరం చెప్పబోమని బీసీసీఐకి ఐఓఏ స్పష్టం చేసింది.
The BCCI wants separate accommodation for the Indian cricketers participating in the 2026 Asian Gameshttps://t.co/EZXM5TM60w
The IOA has said that it will treat the entire Indian contingent equally and cannot extend any special treatment to the Indian cricket team. pic.twitter.com/1m7KgcH8B6
— OpIndia.com (@OpIndia_com) September 5, 2026
‘బీసీసీఐ సీఈవో హేమంగ్ అమిన్ మాతో టచ్లో ఉన్నారు. జపాన్లో వసతుల పరిశీలన కోసం బీసీసీఐ ఓ బృందాన్ని పంపిస్తోంది. అందుకు మాకు అభ్యంతరం లేదు. ఆసియా క్రీడల్లో ఇలా వసతులపై ఫిర్యాదులు రావడం ఇదే మొదటిసారి. భారత బృందాన్ని ఒకేలా చూస్తాం. అందుకే క్రికెటర్లకు వసతుల్లో మార్పులు చేయలేం. ఈ పరిస్థితుల్లో అథ్లెట్ల మంచీచెడూ బీసీసీఐ చూసుకోనుంది. వసతుల పరంగా కొత్త మార్పులేవీ ఉండబోవని భారత ఒలింపిక్ సంఘం స్పష్టం చేసినట్టు సమాచారం. నిర్వాహకులు ఏర్పాటు చేసిన చోటనే బస చేయాలి. ‘మా వల్ల కాదంటే మాత్రం.. సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చు’ అని బీసీసీఐకి ఐఓఏ తేల్చి చెప్పింది’ అని ఐఓఏ సీఈవో రఘురామ్ అయ్యర్ వెల్లడించారు.
‘జపాన్లో ఆసియా క్రీడల ఏర్పాట్ల పట్ల ఏసీసీ, బీసీసీఐ సంతృప్తిగా లేవు. అందుకని పరిశీలకులను జపాన్ పంపిస్తాం. వారు అక్కడి పరిస్థితులపై మాకు నివేదిక ఇస్తారు. టెంట్లలో డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేశారని, వాష్రూమ్లు 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. దాంతో, క్రికెటర్లు అసౌకర్యానికి గురవుతారనే విషయాన్ని ఏసీసీ సమావేశంలో జపాన్ ఒలింపిక్ అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. అంతేకాదు హోటల్ గదులు కూడా చిన్నగా ఉన్నాయి’ అని బీసీసీఐ వర్గాలు ఏఎన్ఐతో పేర్కొన్న విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభం కల్లా పరిస్థితిలో మార్పు లేకుంటే బీ టీమ్ను పంపాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే.. భారత బోర్డు మాత్రం ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు.
భారత పురుషుల స్క్వాడ్ – శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రానా, అర్ష్దీప్, బుమ్రా.
భారత మహిళల స్క్వాడ్ – హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్) స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ప్రతీకా రావల్, రీచా ఘోష్(వికెట్ కీపర్), జి.కమలిని(వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీచరణి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ.