INDvsSA 1st ODI: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జోహన్నస్బర్గ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ పేసర్లు అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్లు అదరగొట్టారు. ఈ ఇద్దరూ తమ పేస్తో నిప్పులు చెరగడంతో తొలి వన్డేలో సఫారీలు 27.3 ఓవర్లలో 116 పరుగులకే తోకముడిచారు. సౌతాఫ్రికా జట్టులో ఆల్ రౌండర్ అండిల్ పెహ్లుక్వాయో (33) టాప్ స్కోరర్. టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ ఐదు వికెట్లు (5/37)తో రాణించగా అవేశ్ ఖాన్ (4/27) కూడా మెరిశాడు. కుల్దీప్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. అర్ష్దీప్ వేసిన ఆ ఓవర్లో నాలుగో బంతికి రీజా హెండ్రిక్స్ బౌల్డ్ కాగా మరుసటి బంతికే రస్సీ వాండర్ డసెన్ కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ ఇద్దరూ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (12)తో కలిసి మూడో వికెట్కు 39 పరుగులు జోడించిన ఓపెనర్ టోని డి జోర్జి (28) కూడా అర్ష్దీపే వేసిన 8వ ఓవర్లో వికెట్ కీపర్ కెఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చాడు. ప్రమాదకర హెన్రిచ్ క్లాసెన్ (6) ను కూడా అర్ష్దీప్ బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయింది.
Maiden 5⃣-wicket haul in international cricket! 👏 👏
Take A Bow – @arshdeepsinghh 🙌 🙌
Follow the Match ▶️ https://t.co/tHxu0nUwwH #TeamIndia | #SAvIND pic.twitter.com/xhWmAxmNgK
— BCCI (@BCCI) December 17, 2023
అర్ష్దీప్ మ్యాజిక్ ముగిసిపోకముందే అవేశ్ ఖాన్ మాయ మొదలైంది. అతడు వేసిన 11వ ఓవర్లో తొలి బంతికే మార్క్రమ్ బౌల్డ్ అవగా తర్వాత బంతికే వియాన్ మల్డర్ (0) కూడా ఎల్బీగా వెనుదిరిగాడు. 58 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాను పెహ్లుక్వాయో ఆదుకున్నాడు. అతడు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు సౌతాఫ్రికా స్కోరు సెంచరీకి చేరడంలో కీలకపాత్ర పోషించాడు. కేశవ్ మహారాజ్ (4)ను అవేశ్ ఖాన్ ఔట్ చేయగా పెహ్లుక్వాయోను అర్ష్దీప్ లెగ్బిఫోర్గా పెవిలియన్కు పంపాడు. పెహ్లుక్వాయో వికెట్ అర్ష్దీప్కు ఈ మ్యాచ్లో ఐదో వికెట్ వన్డేలలో అతడికి ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. నంద్రె బర్గర్ (32 బంతుల్లో 7) ను కుల్దీప్ బౌల్డ్ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్కు తెరపడింది.