INDvsAUS T20I: బర్సపర వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ మరోసారి బ్యాటింగ్లో దుమ్మురేపింది. టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 123 నాటౌట్, 13 ఫోర్లు, 7 సిక్సర్లు) అంతర్జాతీయ స్థాయిలో తొలి శతకాన్ని నమోదుచేసుకున్నాడు. గత రెండు మ్యాచ్లలో రాణించిన యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్లు విఫలమైనా రుతురాజ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 39, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24 బంతుల్లో 31 నాటౌట్, 4 ఫోర్లు) లు ధాటిగా ఆడటంతో భారత్ భారీ స్కోరు చేసింది. రుతురాజ్ శతకంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ సిరీస్లో భారత్ 200 ప్లస్ స్కోరు చేయడం ఇది వరుసగా మూడోసారి. ఆరంభంలో ఆసీస్ బౌలర్లు రాణించడంతో రెండు వికెట్లు కోల్పోయినా తర్వాత కుదురుకుని దంచికొట్టింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన భారత్కు డబుల్ షాకులు తాకాయి. గత రెండు మ్యాచ్లలో అదిరిపోయే ఆరంభాలిచ్చిన జైస్వాల్ (6).. బెరెన్డార్ఫ్ వేసిన రెండో ఓవర్లో వికెట్ కీపర్ వేడ్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే ఇషాన్ కిషన్ (0)ను కేన్ రిచర్డ్సన్ బౌలింగ్లో కవర్స్ దిశగా ఆడబోయి స్టోయినిస్ చేతికి చిక్కాడు.
సూర్య-గైక్వాడ్ భాగస్వామ్యం..
24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ను సూర్య-గైక్వాడ్లు ఆదుకున్నారు. రుతురాజ్ నెమ్మదించినా సూర్య మాత్రం ధాటిగా ఆడాడు. నాథన్ ఎల్లిస్ వేసిన ఐదో ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన భారత సారథి.. సంఘా వేసిన ఏడో ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. హార్ఢీ వేసిన 8వ ఓవర్లో కూడా వరుస ఫోర్లు కొట్టాడు. ధాటిగా ఆడుతున్న సూర్య.. హార్ఢీవేసిన 11వ ఓవర్లో రెండో బంతికి కీపర్ వేడ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 57 పరుగులు జోడించారు.
గైక్వాడ్ సెంచరీ..
సూర్య క్రీజులో ఉన్నంతసేపు నెమ్మదిగా ఆడిన గైక్వాడ్ ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. మరో ఎండ్లో తిలక్ వర్మ కూడా రెచ్చిపోవడంతో భారత స్కోరు పరుగులెత్తింది. కేన్ రిచర్ద్సన్ వేసిన 12వ ఓవర్లో తిలక్ రెండు ఫోర్లు బాదగా గైక్వాడ్ కూడా ఓ బౌండరీ సాధించాడు. హార్డీ వేసిన 14వ ఓవర్లో రెండు ఫోర్లు బాదడంతో గైక్వాడ్ 33 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. అర్థ సెంచరీ తర్వాత రుతురాజ్ మరింత రెచ్చిపోయాడు. సంఘా వేసిన 15వ ఓవర్లో 4, 6 బాదిన అతడు.. హార్డీ వేసిన 18వ ఓవర్లో 6, 6, 4, 6తో మొత్తం 25 పరుగులు పిండుకున్నాడు. మ్యాక్సవెల్ వేసిన ఆఖరి ఓవర్లో ఫస్ట్ బాల్కే సిక్సర్ కొట్టి శతకం పూర్తిచేశాడు. అంతర్జాతీయ టీ20లలో అతడికి ఇదే తొలి శతకం. 33 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన అతడు తర్వాత 19 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేయడం గమనార్హం. మ్యాక్సీ వేసిన ఆఖరి ఓవర్లో రుతురాజ్.. సిక్సర్తో పాటు ఆఖరి మూడు బంతుల్లో రెండు సిక్సర్లు, ఫోర్ కొట్టడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.