INDvsAUS: ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఇరు జట్లూ సన్నద్ధమవుతున్నాయి. తుది పోరులో గెలిచేందుకు రెండు జట్లూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. నెలన్నరగా సాగుతున్న ఈ పోరుకు ఆదివారం ఎండ్ కార్డ్ పడనుండగా ఈ టోర్నీలో తొలి మ్యాచ్ (అక్టోబర్ 08) ఆడిన ఇండియా.. ఆస్ట్రేలియాలు ఆఖరి మ్యాచ్ కూడా ఆడబోతున్నాయి. అయితే ఫైనల్స్కు ముందు ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తమ జట్టుకు అత్యంత ప్రమాదకరమని అన్నాడు.
ఫైనల్ మ్యాచ్కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిన్స్ మాట్లాడుతూ.. ‘అవును.. ఫైనల్లో మాకు పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు మహ్మద్ షమీ. టీమిండియా జట్టుగా సంచలన విజయాలు సాధిస్తోంది. రోహిత్ సేన ఈ టోర్నీలో సమిష్టిగా రాణిస్తోంది..’ అని కామెంట్స్ చేశాడు.
ఈ టోర్నీలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన షమీ.. ఆ తర్వాత జట్టులో కీలక బౌలర్ అయ్యాడు. రోహిత్ ఎప్పుడు బంతినిచ్చినా వికెట్ తీయాలన్నంత కసి షమీలో కనిపిస్తోంది. ఇటీవలే భారత్ – న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా జరిగిన సెమీస్లో టీమిండియా బౌలర్లు విఫలమైన చోట షమీ ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్లలోనే 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. షమీతో పాటు భారత పేసర్లు బుమ్రా, సిరాజ్లు కూడా ఇరగదీస్తున్నారు.