Para Shooter Rudransh | ఒస్జెక్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ పారా షూటింగ్ వరల్డ్కప్లో భారత యువ షూటర్ రుద్రాంశ్ ఖండేల్వాల్ పసిడి పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పీ1 10 మీటర్ల ఎయిర్పిస్టల్ ఎస్హెచ్1 విభాగం ఫైనల్లో రుద్రాంశ్ 240.6 పాయింట్లతో అగ్రస్థానంతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. మొత్తం ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ తుదిపోరులో రుద్రాంశ్..ప్రపంచ రికార్డు ప్రదర్శన కనబరిచాడు.
టోక్యో పారాలింపిక్స్ స్వర్ణ విజేత మనీశ్ నార్వల్తో పోటీ ఎదురైనా వెనుకకు తగ్గకుండా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో పోటీకి దిగిన మనీశ్ నార్వల్, సంతోష్ గాదె వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మొత్తంగా టోర్నీని భారత్ 17 పతకాలతో ముగించింది. ఇందులో ఏడు స్వర్ణాలు సహా ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.