ఇది కదా మ్యాచ్ అంటే.. ఇది కదా పోరాటం అంటే.. ఇది కదా వన్డే క్రికెట్ అసలు మజా అంటే..
ఆహా.. ఏమా మ్యాచ్.. ఏమా బ్యాటింగ్.. నాలుగేండ్ల తర్వాత అంతర్జాతీయ వన్డేకు ఆతిథ్యమిచ్చిన ఉప్పల్ స్టేడియం.. పరుగుల జడివానలో తడిసి ముద్దెంది.
సహచరుల నుంచి పెద్దగా సహకారం అందని చోట భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతో అభిమానులను ఉర్రూతలూగిస్తే.. ఆశలే లేని స్థితిలో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ బ్రాస్వెల్ దంచికొట్టాడు. చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో విజయం రోహిత్ సేనను వరించగా..
ఎన్నో అంచనాలతో మైదానానికి వచ్చిన అభిమానులకు పైసావసూల్ పెర్ఫార్మెన్స్ కనువిందు చేసింది!
హైదరాబాద్, ఆట ప్రతినిధి: పరుగుల వరద పారిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయింది. శ్రీలంకపై వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ఫుల్ జోష్లో ఉన్న భారత్.. న్యూజిలాండ్తో హోరాహోరీ పోరులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేండ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా జరిగిన వన్డేలో ఇరు జట్లు కలిసి 686 పరుగులు చేయగా.. మూడు మ్యాచ్ల సిరీస్లో రోహిత్ సేన 1-0తో ముందంజ వేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్యా (28) పర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో డారిల్ మిషెల్, హెన్రీ షిప్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. మిషెల్ బ్రాస్వెల్ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) మెరుపు సెంచరీతో భయపెట్టగా.. మిషెల్ శాంట్నర్ (45 బంతుల్లో 57; 7 ఫోర్లు, ఒక సిక్సర్), ఫిన్ అలెన్ (40; 7 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. శుభ్మన్ గిల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రాయ్పూర్లో శనివారం రెండో వన్డే జరుగనుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు శుభారంభం దక్కింది. ప్రేక్షకులతో కిక్కిరిసిన మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ దంచికొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. తొలి ఓవర్లో రోహిత్ బౌండ్రీల ఖాతా తెరిస్తే.. మరుసటి ఓవర్లో గిల్ ఫోర్ బాదాడు. మూడో ఓవర్లో 4,6తో అభిమానులను అలరించిన హిట్మ్యాన్.. ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. ఫలితంగా 10 ఓవర్లలో భారత్ 52/0తో నిలిచింది. చాన్నాళ్లుగా భారీ ఇన్నింగ్స్ ఆడని రోహిత్ శర్మ హైదరాబాద్లో ఆ లోటు భర్తీ చేస్తాడానుకుంటున్న సమయంలో అతడు ఔటయ్యాడు. వరుస సెంచరీలతో ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కువసేపు నిలువలేకపోయాడు. 10 బంతులాడి 8 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఒక వైపు వికెట్లు పడుతుంటే మరో ఎండ్లో గిల్ మొండిగా నిలిచాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లాథమ్ పొరబాటుతో బతికిపోయిన అతడు.. స్లాగ్ స్వీప్తో సిక్సర్ బాది అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ కిషన్ (5) విఫలం కాగా.. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాతో కలిసి గిల్ విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. 87 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. ఆఖర్లో మరింత చెలరేగిపోయి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు.
42 ఓవర్లు ముగిసేసరికి భారత్ 269/5 చేయగా.. గిల్ 147 పరుగులతో క్రీజులో నిలిచాడు. ఈ దశలో బ్రాస్వెల్ బంతిని లాంగాన్ మీదుగా సిక్సర్ బాది 150 మార్క్ దాటిన గిల్.. టిక్నెర్ వేసిన 48వ ఓవర్లో రెండు సిక్సర్లతో 182 మీదకు వచ్చేశాడు. యువ ఆటగాడి డబుల్ సెంచరీ పూర్తవుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్ తొలి మూడు బంతుల్ని గిల్ సిక్సర్లుగా మలిచి.. అద్భుతం ఆవిష్కరించాడు. తొలి బంతిని లెగ్సైడ్ స్టాండ్లో పడేసిన గిల్.. రెండో బంతిని లాంగాఫ్ మీదుగా సిక్సర్ బాదాడు. యార్కర్గా వచ్చిన మూడో బంతిని గీత దాటించిన శుభ్మన్ సంబురాల్లో మునిగిపోగా.. అతడి నామస్మరణతో మైదానం
మోతెక్కిపోయింది.
నమ్ముకున్న నాయకుడు రోహిత్ కాసేపు అలరించినా.. త్వరగానే పెవిలియన్ చేరిపోయాడు! ఫుల్ ఫామ్లో ఉన్న రన్మెషీన్ విరాట్ కోహ్లీ ఒక్క ఫోర్తోనే సరిపెట్టుకున్నాడు! తానాడిన చివరి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు! మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఫర్వాలేదనిపించినా.. భారీ స్కోర్లు చేయలేకపోయారు! కానీ ఒక్కడు మాత్రం చివరి వరకు నిలిచాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన ఆ యువ ఆటగాడు.. జట్టుకు కొండంత స్కోరు అందించేంత వరకు అలుపెరుగకుండా శ్రమించాడు. పర్ఫెక్ట్ వన్డే ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపిన ఆ యంగ్ గన్.. 50, 100, 150 ఇలా దంచుకుంటూ పోయాడు.. డబుల్ సెంచరీ అందుకోవం కష్టమే అనుకుంటున్న తరుణంలో ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ బౌలర్గా గుర్తింపు సాధించిన ఫెర్గూసన్ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. జట్టులో మరే ఆటగాడు 35 పరుగుల మార్క్ దాటకున్నా.. టీమిండియా స్కోరు 349 పరుగులు అయిందంటే అది అతడి అవిశ్రాంత పోరాటమే. జాతీయ జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటున్న ఆ యువ కెరటమే శుభ్మన్ గిల్. భాగ్యనగర వాసులకు ఫుల్ వినోదాన్నిచ్చిన శుభ్మన్పై ప్రత్యేక కథనం..
బంగ్లాదేశ్తో చివరి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన అనంతరం.. శ్రీలంకతో తొలి వన్డేలో ఇషాన్ కిషన్కు తుది జట్టులో చోటు దక్కకపోవడంతో.. శుభ్మన్ గిల్ స్థానంలో ఇషాన్కు అవకాశం ఇవ్వాలనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే గత కొంత కాలంగా నిలకడ కొనసాగిస్తున్న గిల్నే ఆడిస్తామని రోహిత్ భరోసానివ్వగా.. లంకతో మూడు మ్యచ్ల్లోనూ రాణించిన గిల్.. తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో మ్యాచ్లో శతక్కొట్టాడు. దీంతో సిరీస్ ముగిసేలోపు గిల్ ఎంపికపై విమర్శలు చేసినవాళ్లే.. అతడిపై ప్రశంసలు కురిపించారు. అదే జోరు న్యూజిలాండ్ సిరీస్లోనూ కొనసాగించిన ఈ యువ ఓపెనర్.. ఉప్పల్లో పరుగుల ఉప్పెన సృష్టించాడు. 50 ఓవర్ల ఆటలో రాణించాలంటే సహనం ఎంత ముఖ్యమో తన ఆటతీరుతో రుజువు చేశాడు. టీమ్ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి క్రీజులో అడుగుపెట్టిన గిల్.. ఆఖరి ఓవర్ వరకు మైదానంలో నిలిచాడు. తొలుత కెప్టెన్ ధాటిగా ఆడుతుంటే.. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతడికి సహకరించిన గిల్.. ఆ తర్వాత భారత్ వరుస వికెట్లు కోల్పోతున్న దశలో తానే బాధ్యత తీసుకొని పరుగుల ప్రవాహం కొనసాగించాడు. సూర్యకుమార్ తో కలిసి నాలుగో వికెట్కు 65 పరుగులు జోడించిన గిల్.. పాండ్యాతో ఐదో వికెట్కు 74 రన్స్ జత చేశాడు. వీరిద్దరు వెనుదిరిగిన అనంతరం వాషింగ్టన్ సుందర్తో ఆరో వికెట్కు 43 పరుగులు జోడించాడు. చివర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు లేనప్పుడు మాజీ కెప్టెన్ ధోనీ తరహాలో బాధ్యతనంతా భుజాన మోస్తూ.. కుల్దీప్ను నాన్స్ట్రయికింగ్ ఎండ్కు పరిమితం చేసి ఎనిమిదో వికెట్కు 16 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన భారత ప్లేయర్గా గిల్ చరిత్రకెక్కాడు. 19 ఇన్నింగ్స్ల్లో గిల్ ఈ మార్క్ చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్ (24 ఇన్నింగ్స్ల్లో) రెండో స్థానంలో ఉన్నారు.
వన్డేల్లో ద్విశతకం చేసిన ఐదో భారత ఆటగాడిగా గిల్ రికార్డుల్లోకెక్కాడు. సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, రోహిత్ శర్మ,ఇషాన్ కిషన్ గతంలో ద్విశతకాలు నమోదు చేశారు.
ఉప్పల్లో ప్రేక్షకుల సంఖ్య 31755
భారత్: రోహిత్ (సి) మిషెల్ (బి) టిక్నెర్ 34, గిల్ (సి) ఫిలిప్స్ (బి) షిప్లీ 208, కోహ్లీ (బి) శాంట్నర్ 8, ఇషాన్ (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 5, సూర్యకుమార్ (సి) శాంట్నర్ (బి) మిషెల్ 31, పాండ్యా (బి) మిషెల్ 28, సుందర్ (ఎల్బీ) షిప్లీ 12, శార్దూల్ (రనౌట్) 3, కుల్దీప్ (నాటౌట్) 5, షమీ (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు: 13, మొత్తం: 50 ఓవర్లలో 349/8. వికెట్ల పతనం: 1-60, 2-88, 3-110, 4-175, 5-249, 6-292, 7-302, 8-345, బౌలింగ్: షిప్లీ 9-0-74-2, ఫెర్గూసన్ 10-0-77-1, టిక్నెర్ 10-0-69-1, శాంట్నర్ 10-0-56-1, బ్రాస్వెల్ 6-0-43-0, డారిల్ మిషెల్ 5-0-30-2.
న్యూజిలాండ్: అలెన్ (సి) (సబ్) షాబాజ్ (బి) శార్దూల్ 40, కాన్వే (సి) కుల్దీప్ (బి) సిరాజ్ 10, నికోల్స్ (బి) కుల్దీప్ 18, డారిల్ మిషెల్ (ఎల్బీ) కుల్దీప్ 9, లాథమ్ (సి) సుందర్ (బి) సిరాజ్ 24, ఫిలిప్స్ (బి) షమీ 11, బ్రాస్వెల్ (ఎల్బీ) శార్దూల్ 140, శాంట్నర్ (సి) సూర్యకుమార్ (బి) సిరాజ్ 57, షిప్లీ (బి) సిరాజ్ 0, ఫెర్గూసన్ (సి) గిల్ (బి) పాండ్యా 7, టిక్నెర్ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు: 19, మొత్తం: 49.2 ఓవర్లలో 337 ఆలౌట్. వికెట్ల పతనం: 1-28, 2-70, 3-78, 4-89, 5-110, 6-131, 7-293, 8-294, 9-328, 10-337, బౌలింగ్: షమీ 10-1-69-1, సిరాజ్ 10-2-46-4, హార్దిక్ 7-0-70-1, కుల్దీప్ 8-1-43- 2, శార్దూల్ 7.2-0-54-2, సుందర్ 7-0-50-0.