న్యూఢిల్లీ: బీడబ్ల్యూఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్లో భారత యువ షట్లర్ తస్నీమ్ మీర్ నంబర్వన్ ర్యాంక్ అందుకుంది. అండర్-19 మహిళల సింగిల్స్లో టాప్ ర్యాంక్ అధిరోహించిన తొలి భారత షట్లర్గా తస్నీమ్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. గుజరాత్కు చెందిన ఈ 16 ఏండ్ల యువ షట్లర్ గతేడాది మూడు అంతర్జాతీయ టోర్నీల్లో టైటిల్ విజేతగా నిలిచింది. టోర్నీ టోర్నీకి ర్యాంకింగ్ పాయింట్లు మెరుగుపర్చుకున్న తస్నీమ్ మూడో ర్యాంక్ నుంచి నంబర్వన్కు చేరుకుంది. దీనిపై స్పందిస్తూ ‘నేను అసలు ఇది ఊహించలేదు. కరోనా వైరస్ విజృంభణతో పలు టోర్నీలు రద్దు, వాయిదా కారణంగా నంబర్వన్ చేరుకుంటాననుకోలేదు. కానీ బల్గేరియా, ఫ్రాన్స్, బెల్జియం టోర్నీల్లో గెలువడం ద్వారా ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్నాను. ఈ ఫీట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. కెరీర్లో ఇది మరిచిపోలేని సందర్భం’ అని అంది.