భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా ఐటీటీఎఫ్-ఏటీటీయూ ఆసియా కప్లో సంచలనం సృష్టించింది. సింగిల్ ప్రి- క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంక్ క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ జింగ్టాంగ్పై విజయం సాధించింది. ఏడు సెట్ల మ్యాచ్లో మనికా 8-11, 11-9, 11-6, 11-6, 9-11, 8-11, 11-9 పాయింట్లతో జింగ్టాంగ్ని ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్లో చెన్ జు యుతో తలపడనుంది. ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో మనికా ప్రస్తుతం 44వ స్థానంలో ఉంది.
‘ప్రపంచంలో ఏడో ర్యాంకింగ్ క్రీడాకారిణిపై విజయం సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి మ్యాచ్లో విజయం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాను. తర్వాతి రౌండ్లలోనూ ఇదే ఉత్సాహంతో ఆడతాను’ అని మనికా చెప్పింది.
మరో మ్యాచ్లో భారత్కు చెందిన జి.సాథియాన్, జపాన్ క్రీడాకారిణి యకియ ఉడా చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది ఐటీటీఎఫ్-ఏటీటీయూ ఆసియా కప్ బ్యాంకాక్లో జరుగుతోంది. ప్రతి ఏడాది ఐటీటీఎఫ్-ఏటీటీయూ ఆసియన్ కప్ని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య, ఆసియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ కలిసి నిర్వహిస్తాయి. మొదటి ఐటీటీఎఫ్-ఏటీటీయూ పోటీలు 1983లో జరిగాయి.