అమ్స్టెల్వీన్ : ఐదు దశాబ్దాలుగా హాకీ ప్రపంచకప్లో అందని ద్రాక్షగా ఊరిస్తున్న ట్రోఫీ కల మరోసారి నెరవేరలేదు. ఈసారైనా మన ప్లేయర్లు టైటిల్ కరువు తీరుస్తారని ఆశించిన భారత హాకీ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. సెమీస్ రేసులో నిలవాలంటే అర్జెంటీనాపై కనీసం మూడు గోల్స్ తేడాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ 3-5తో ఓటమిపాలై సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఆట ఆరంభం నుంచి చివరిదాకా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అర్జెంటీనా ఆటగాళ్లలో డొమెనె (33, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా జాక్విన్ టొస్కని (1వ), నికోలస్ (6వ), లుకాస్ (53వ) తలా ఓ గోల్ కొట్టారు. భారత్ నుంచి సుఖ్జీత్ సింగ్ (10, 58వ) డబుల్ గోల్స్ చేయగా హార్ధిక్ సింగ్ (60వ) ఒక గోల్ సాధించాడు. ఈ ఓటమితో సెమీస్ రేసు నుంచి తప్పుకున్న భారత్.. వర్గీకరణ మ్యాచ్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.