సుదీర్ఘ టెస్టు సిరీస్ సమరంలో భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక సమరానికి రంగం సిద్ధమైంది. మూడు మ్యాచ్ల్లో చెరో గెలుపుతో సిరీస్లో సమంగా ఉన్న ఇరు జట్లు ఓవల్లో తాడోపేడో తేల్చుకునేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యాయి. ఓవల్ వేదికగా నేటి నుంచి మొదలయ్యే నాలుగో టెస్టులో సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. లీడ్స్ టెస్టులో ఓటమితో ఒకింత ఒత్తిడిలో ఉన్న కోహ్లీసేన..తుది కూర్పుపై దృష్టి పెడితే జోరుమీదున్న ఇంగ్లండ్ ఆధిక్యంపై కన్నేసింది. ఐదుగురు బౌలర్ల ప్రయోగానికి కెప్టెన్ కోహ్లీ కట్టుబడుతాడా లేక అదనపు బ్యాట్స్మన్ వైపు మొగ్గుచూపుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది.
లండన్: ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు వేళయైంది. ఓవల్ మైదానం వేదికగా గురువారం నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మొదలుకానుంది. లీడ్స్ టెస్టులో భారీ ఓటమితో కోహ్లీసేన కుంగుబాటులో ఉంటే..ఇన్నింగ్స్ విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్ ధీమాతో కనిపిస్తున్నది. సొంతగడ్డపై సుదీర్ఘ సమరంలో టీమ్ఇండియాను కట్టడి చేసేందుకు ఇంగ్లిష్ జట్టు పదునైన వ్యూహాలతో ముందుకెళుతుంటే…తిరిగి ఎలాగైనా పుంజుకోవాలన్న పట్టుదలతో టీమ్ఇండియాలో కనిపిస్తున్నది. బౌలింగ్ పరంగా భారత్ పటిష్ఠంగా కనిపిస్తున్నా..బ్యాటింగ్ కలవరపాటుకు గురిచేస్తున్నది. ఇందుకు భిన్నంగా ఇంగ్లండ్ కనిపిస్తున్నది. కెప్టెన్ జోరూట్ హ్యాట్రిక్ సెంచరీలతో ఊపుమీదుంటే…డేవిడ్ మలన్ పునరాగమనంలో సత్తాచాటాడు. లీడ్స్ టెస్టులో బర్న్స్, హమీద్ టచ్లోకి రాగా, బెయిర్స్టో, మొయిన్ అలీ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమవుతున్నారు. బౌలింగ్ విషయానికొస్తే అండర్సన్, రాబిన్సన్, ఓవర్టన్ త్రయం పోటాపోటీగా రాణిస్తున్నారు. అయితే నాలుగో టెస్టుకు వేదికైన పిచ్ స్పిన్కు అనుకూలించనున్న నేపథ్యంలో ఎవరిది పైచేయి అన్నది ఆసక్తిరేపుతున్నది.
కూర్పుపై తర్జన భర్జన: ఇంగ్లండ్తో ఓవల్ టెస్టుకు తుది జట్టు కూర్పుపై టీమ్ఇండియా మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతున్నది. లీడ్స్ టెస్టులో బ్యాటింగ్ లోపాలు మరోమారు బట్టబయలైతే..బౌలింగ్ దళం శక్తిమేరకు రాణించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐదుగురు బౌలర్ల ఫార్ములాకు కట్టుబడి ఉండాలా లేక బౌలర్ స్థానంలో అదనపు బ్యాట్స్మన్ను తీసుకోవాలా అన్న దానిపై కెప్టెన్ కోహ్లీ మదనపడుతూనే ఉన్నాడు. ఇంగ్లండ్తో రెండో టెస్టులో గాయపడ్డ ఆల్రౌండర్ జడేజా స్థానంలో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ జట్టులోకి రావడం దాదాపు ఖాయం కాగా, అంతగా ఆకట్టుకోలేకపోయిన ఇషాంత్శర్మకు బదులుగా యువ పేసర్ శార్దుల్ ఠాకూర్ను తీసుకునే చాన్స్ కనిపిస్తున్నది. ఇదిలా ఉంటే మిడిలార్డర్ ఫామ్ జట్టును ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీ పేలవ ఫామ్ కలవరపెడుతున్నది. మూడో టెస్టులో అర్ధసెంచరీ మినహాయిస్తే..విరాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఇప్పటి వరకు రాలేదు. ఇక వైస్ కెప్టెన్ రహానే నిలకడలేమి జట్టుకు భారంగా మారింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే క్రికెటర్గా ముద్రపడ్డ అజింక్యా..ఆ ప్రభావాన్ని నానాటికి కోల్పోతున్నాడు అనిపిస్తున్నది. అనవసర షాట్లకు పోయి విలువైన వికెట్ సమర్పించుకుంటున్నాడు. దీంతో రహానేకు బదులుగా తెలుగు తేజం హనుమ విహారి లేక సూర్యకుమార్ యాదవ్ను తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. రహానే ఇలా ఉంటే..పుజారా పరిస్థితి మరోలా ఉంది. ఇన్నాళ్లు పుజారా క్రీజులో ఉంటే చాలు..తర్వాత వరుస బ్యాట్స్మెన్ తమ వంతు కోసం చూసేవారు. కానీ పరిస్థితిలో మార్పు వచ్చింది. తన శైలికి భిన్నంగా పుజారా బ్యాటింగ్ కొనసాగుతున్నది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో దూకుడుగా ఆడిన పుజారా ఇంగ్లండ్ హిట్లిస్ట్లో టాప్లో ఉన్నాడు. ఈ నయా వాల్ను తప్పిస్తే..మిగతా పని పూర్తిచేయవచ్చన్న ఉద్దేశం ఇంగ్లండ్ బౌలర్లలో స్పష్టంగా కనిపిస్తున్నది. మరోవైపు సిరీస్లో ఇప్పటి వరకు రిజర్వ్ ఆటగానిగా ఉన్న యువ పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణను ప్రధాన జట్టులోకి వచ్చేశాడు. బౌలర్లపై ఒత్తిడిని నిశితంగా గమనిస్తున్న మేనేజ్మెంట్ సీనియర్ పేసర్లు షమీ, బుమ్రా విశ్రాంతినిస్తూ బెంచ్ పరీక్షించే అవకాశముంది. ఇదే జరిగితే తుది జట్టులో భారీ మార్పులు చోటు చేసకోవచ్చు.
మార్పులతో
భారత్ లాగే ఇంగ్లండ్ కూడా మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. వికెట్కీపర్ బట్లర్ తన భార్య రెండో సంతానం కోసం జట్టును వీడగా, బెయిర్స్టో ఆ బాధ్యతలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. పునరాగమనంలో మలన్ సత్తాచాటగా, సామ్ కరన్ స్థానంలో క్రిస్ వోక్స్ తుది జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. మొత్తంగా ఓవల్ టెస్టులో భారత్కు పరీక్ష పెట్టేందుకు ఇంగ్లండ్ సర్వసన్నద్ధతతో సిద్ధమైంది.