బుస్టో అర్సిజియో(ఇటలీ): ప్రపంచ ఒలింపిక్ బ్యాక్సింగ్ క్వాలిఫయర్ టోర్నీలో భారత యువ బాక్సర్ నిశాంత్ సత్తాచాటుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల 71కిలోల ప్రిక్వార్టర్స్ బౌట్లో నిశాంత్ 5-0 తేడాతో క్రిస్టోస్ కరాటిస్(గ్రీస్) అలవోక విజయం సాధించాడు. గతేడాది ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన ఈ 23 ఏండ్ల యువ బాక్సర్..గ్రీస్ బాక్సర్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.
ఆది నుంచి తనదైన దూకుడు ప్రదర్శించిన నిశాంత్ పవర్ఫుల్ పంచ్లతో విరుచుకుపడ్డాడు. గ్రీస్ బాక్సర్కు ఎక్కడా అవకాశమివ్వకుండా రౌండ్ రౌండ్కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయాడు. క్వార్టర్స్లో అమెరికా బాక్సర్ ఒమరీ జోన్స్తో నిశాంత్ తలపడుతాడు. ఇదే టోర్నీలో ఇప్పటికే దీపక్ బోరియా, హుసాముద్దీన్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే.