తాష్కెంట్: ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తున్న హుసామ్.. మెగాటోర్నీలో ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన 57కిలోల బౌట్లో హుసామ్ 5-0 తేడాతో ల్యు పింగ్(చైనా)పై అద్భుత విజయం సాధించాడు. తొలి నుంచే తనదైన దూకుడు ప్రదర్శించిన ఈ ఇందూరు బాక్సర్ చైనా బాక్సర్పై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డాడు. ఎక్కడా అవకాశమివ్వకుండా క్లీన్పంచ్లతో చెలరేగుతూ రౌండ్ రౌండ్కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయాడు
. ఏ దశలోనూ చైనా బాక్సర్..హుసామ్కు పోటీనివ్వలేకపోయాడు. ఇదే అదనుగా జోరు కనబరిచిన హుసామ్ అలవోక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగే ప్రిక్వార్టర్స్లో సవిన్ ఎడ్వర్డ్(రష్యా)తో హుసామ్ తలపడుతాడు. మరోవైపు 92కిలోల బౌట్లో నవీన్కుమార్ 5-0తో లీ సాంగ్విన్(దక్షిణ కొరియా)పై అలవోక విజయం సాధించాడు. ప్రిక్వార్టర్స్లో ఎమాన్యుయెల్ రయెస్(స్పెయిన్)తో నవీన్కుమార్ ఢీకొంటాడు.