అంటాల్య : ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత యువ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ పసిడి వెలుగులు విరజిమ్మింది. శనివారం వేర్వేరు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ రెండు స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఫైనల్లో పోటీకి దిగిన జ్యోతి 149-146 తేడాతో సారా లోపెజ్(కొలంబియా)పై చిరస్మరణీయ విజయం సాధించింది. మెగాటోర్నీలో సురేఖకు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. లీగ్ దశ నుంచే ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన ఈ విజయవాడ ఆర్చర్ ఫైనల్లోనూ అదే దూకుడు కనబర్చింది. సరిగ్గా రెండేండ్ల క్రితం లోపెజ్ చేతిలో ఎదురైన ఓటమికి సురేఖ తాజాగా ప్రతీకారం తీర్చుకుంది.
సెమీస్, ఫైనల్ కలిపి ప్రత్యర్థులకు మూడు పాయింట్లు చేజార్చుకుందంటే ఈ యువ ఆర్చర్ జోరు ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. తొలి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. లోపెజ్ పుంజుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే సురేఖ మెరుగైన ఆధిక్యంలో ఉండటం కలిసొచ్చింది. మరోవైపు మిక్స్డ్ కాంపౌండ్ ఫైనల్లో సురేఖ, ఓజాస్ దేవ్తలె జోడీ 159-154 తేడాతో చైనీస్ తైపీ ద్వయంపై సంచలన విజయం సాధించింది. జ్యోతి ఎనిమిది సార్లు పది పాయింట్లు ఖాతాలో వేసుకుంటే ఓజాస్ ఒకసారి 9 పాయింట్లకు పరిమితమయ్యాడు. దీంతో పాయింట్ తేడాతో ప్రపంచ రికార్డు (160/160) చేజారింది. కాంపౌండ్ విభాగంలో భారత్కు ఇది రెండో పసిడి పతకం.