వెలెన్సియా: ఐదు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నీలో భారత మహిళల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతున్నది. తొలి పోరులో స్పెయిన్ చేతిలో ఓడిన టీమ్ఇండియా.. ఆదివారం రెండో పోరులో టీమ్ఇండియా 1-2తేడాతో బెల్జియం చేతిలో ఓడింది. భారత్ తరఫున వైష్ణవి (56వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా.. బెల్జియంకు అంబ్రే (22వ ని.లో), వెర్సవెల్ (37వ ని.లో) గోల్స్ అందించారు. మ్యాచ్ ఆరంభం నుంచే బెల్జియం ప్లేయర్లు పూర్తి ఆధిపత్యం కనబర్చగా.. మన అమ్మాయిలు వారికి పోటీ ఇవ్వలేకపోయారు. తదుపరి పోరులో మంగళవారం జర్మనీతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.