శ్రీలంక పర్యటనలో ఉన్న భారత మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. టీ20 సిరీస్ గెలిచిన తర్వాత వన్డే సిరీస్లో కూడా శుభారంభం చేశారు. ఈ క్రమంలో జరిగినె రెండో వన్డేలో కూడా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత్ ముందు 174 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఛేజింగ్లో భారత ఓపెనర్లు స్మృతి మంధాన (94 నాటౌట్), షెఫాలీ వర్మ (71 నాటౌట్) ఇద్దరూ ధాటిగా ఆడారు. వీళ్లిద్దరూ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత జట్టు 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. నాలుగు వికెట్లతో శ్రీలంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన రేణుకా సింగ్ (4/28)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్లో భారత జట్టు 2-0తో కైవసం చేసుకుంది. మూడో వన్డే గురువారం జరగనుంది.